బెంగుళూరు: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో వరల్డ్ కప్లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఓటమిపై అనుష్క శర్మని నిందించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. సెమీ పైనల్లో ఓటమికి అనుష్కకు సంబంధం ఏమిటని ప్రశ్నించాడు.
వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ సరిగా ఆడకుంటే ఇన్ని నిందలు వేస్తారా..? అని అభిమానులకు నేరుగా ప్రశ్నలు సంధించాడు. సోషల్ మీడియాలో నాపై ఆరోపణలు చేయడం ఎంత మాత్రం సరికాదన్నాడు. వరల్డ్ కప్లో స్ధిరంగా ఆడేందుకే ప్రయత్నించానని చెప్పుకొచ్చిన కోహ్లీ, సెమీస్ మ్యాచ్ ఓటమి అనంతరం తనపై వచ్చిన ఆరోపణలు షాక్కు గురిచేశాయని అన్నారు.
గత ఐదేళ్లుగా భారత క్రికెట్ జట్టు విజయాల్లో ఎంతో కీలకపాత్ర పోషించానని హిందీ న్యూస్ ఛానల్ ఏబీపీకి వరల్డ్ కప్ తర్వాత తొలిసారి ఇచ్చిన ఇంటర్యూలో తన మనసులోని భావాలను పంచుకున్నాడు.
ఆస్టేలియాతో జరిగిన సెమీ పైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 13 బంతులాడి ఒక్క పరుగుకే ఔటైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ ఆసీస్ చేతిలో 95 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది.
భారత జట్టుని, విరాట్ కోహ్లీని ఛీర్ చేసేందుకు బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఈ మ్యాచ్కి హాజరైన విషయం తెలిసిందే. మ్యాచ్ ముందు రోజు అనుష్క శర్మతో షికార్లు కొట్టడం వల్లే విరాట్ కోహ్లీ విఫలమయ్యాడని మీడియాలో వార్తా కథనాలు వెల్లడైన విషయం తెలిసిందే.