కాసింత సమయం దొరికింది:
గురువారం రాత్రి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్తో ఇన్స్టాగ్రామ్ లైవ్చాట్లో విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయి. లాక్డౌన్ ఎలా ఉంది అని పీటర్సన్ అడగ్గా.. 'మేం ఇద్దరం ఇంట్లోనే ఉన్నాం. ఇది చాలా కష్టంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితులు రాకముందే మాకు కాసింత సమయం దొరికింది. మా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాం. కలిసి తిరగడానికి మంచి ప్రదేశం దొరికింది. అందుకు అదృష్టవంతులం. ఈరోజుల్లో జనం చాలా అవస్థలు పడుతున్నారు' అని కోహ్లీ సమాధానం ఇచ్చాడు.
ఇంతకాలం ఎప్పుడూ ఉండలేదు:
ప్రస్తుతం అనుష్కతో ఎలా ఉంటున్నావ్ అని పీటర్సన్ ప్రశ్నించగా... 'పెళ్లైనప్పటి నుంచి మేమిద్దరం ఒకేచోట ఇన్ని రోజులు కలిసి ఉండటం ఇదే తొలిసారి. ఒకేసారి ఇంతకాలం ఎప్పుడూ ఉండలేదు. కాక్రికెట్, సినిమాలతో ఇద్దరం బిజీగా ఉండేవాళ్లం. ఇప్పుడు కాస్త వింతగా ఉంది. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించాలనుకోవడం సరికాదు. కానీ.. అదే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సానుకూల దృక్పథంతో ఉండాలి. ఇవి కఠిన రోజులు' అని కోహ్లీ బదులిచ్చాడు.
అనుష్కతో ఉండటం సంతోషంగా ఉంది:
ఏదైనా మిసవ్వుతున్నావా కోహ్లీ అని పీటర్సన్ అడిగాడు. 'నేనేం మిస్సవ్వట్లేదు. అనుష్కతో ఉండటం సంతోషంగా ఉంది. ఒకవేళ ఏదైనా టూర్ సందర్భంగా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే చాలా కష్టంగా ఉండేది' అని కోహ్లీ అన్నాడు. గురువారం విరుష్క జోడీ ట్విట్టర్లో ఓ ఫొటో పోస్ట్ చేసింది. భార్యాభర్తలిద్దరూ నవ్వుతూ పోజిచ్చిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. 'మా నవ్వులు నకిలీ కావొచ్చేమో కానీ.. మేము కాదు' అని కోహ్లీ కాప్షన్ పెట్టాడు.
ప్రతి బంతికి 120 శాతం ప్రదర్శన ఇస్తా:
గతంలో ఓసారి ఎంఎస్ ధోనీ, నేను నీ ఆట, నాయకత్వం గురించి చర్చించాం. దూకుడు నాయకత్వాన్ని కొనసాగించగలరా లేదా అని మాట్లాడుకున్నాం అని కోహ్లీతో పీటర్సన్ అన్నాడు. 'నేను ధోనీతో ఆడినప్పుడు ప్రతిదీ గమనించా. మొదట ఆటను ఆస్వాదించా. ఇప్పుడు నేను కెప్టెన్. ప్రతి బంతికి 120 శాతం ప్రదర్శన ఇస్తా. నేను ఇలాకాకుండా వేరే విధంగా ఆడలేను. 120 శాతం ఆడటం లేదు అని నాకు అనిపించని రోజు క్రికెట్ నుండి తప్పుకుంటా' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. మేము వికెట్ తీస్తే.. మాకంటే ఎక్కువగా నువ్వు సంబరాలు చేసుకుంటావ్ అని మా బౌలర్లు నా వద్దకు వచ్చి చెపుతారు, నేను అంతలా ఆటను ఆస్వాదిస్తా అని కోహ్లీ తెలిపాడు.