
హైదరాబాద్: కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 1-2తో చేజార్చుకున్న కోహ్లీసేన ప్రస్తుతం ఆరు వన్డేల సిరిస్కు సిద్ధమైంది. ఈ సిరిస్లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే గురువారం (ఫిబ్రవరి 1)న డర్బన్ వేదికగా జరగనుంది.
తొలి వన్డే నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది ఇంగ్లాండ్లో జరిగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్కు కోర్ ప్లేయర్లను ఇప్పటికే గుర్తించామని, ఒకే ఒక్క స్థానం మాత్రమే మిగిలి ఉందని చెప్పాడు. సఫారీ గడ్డపై జరగనున్న ఆరు వన్డేల సిరిస్తో వరల్డ్ కప్కు భారత్ సన్నాహాలు ప్రారంభించిందని తెలిపాడు.
'వరల్డ్ కప్కు కోర్ ప్లేయర్లను గుర్తించాం. అయితే ఒక స్థానాన్ని మాత్రం ఎవరు భర్తీ చేస్తారో తెలియాల్సి ఉంది. ఈ విషయంపై జట్టు మేనేజ్మెంట్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది. కోర్ ప్లేయర్లు మాత్రం ఇప్పటికే సత్తా చాటుతున్నారు. ఏ స్టేజిలోనైనా మార్పులు జరగొచ్చు. ఏది ఏమైనప్పటికీ కోర్ ప్లేయర్లను ఇప్పటికే గుర్తించాం' అని కోహ్లీ తెలిపాడు.
బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానం కోసం ఓ మంచి ఆటగాడి కోసం ఎదురు చూస్తున్నట్లు కోహ్లీ చెప్పాడు. 'మిడిల్ ఆర్డర్(క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది). లోయర్ మిడిల్ ఆర్డర్ను ఇప్పటికే క్రమబద్ధీకరించాం. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ ఆర్డర్లో పాండ్యా, జాదవ్, ధోనిలతో ఇప్పటికే పరీక్షించాం' అని కోహ్లీ తెలిపాడు.
'గత కొన్ని గేమ్ల నుంచి నెంబర్.4 స్థానంలో అనేక ప్రయోగాలు చేశాం. జట్టులో ఈ ఒక్క స్థానాన్ని పటిష్టం చేయాల్సి ఉంది. మిగతా జట్టంతా సమతూకంగా ఉంది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. వన్డే జట్టులో కేఎల్ రాహుల్ తిరిగి చోటు దక్కించుకుంటాడా? అన్న ప్రశ్నకు గాను కోహ్లీ తనదైన శైలిలో స్పందించాడు.
'ఏదైనా సాధ్యమే. కేఎల్ రాహుల్ క్వాలిటీ ప్లేయర్. వన్డే క్రికెట్ ఆడి చాలా రోజులైంది. టెస్టు క్రికెట్ లేదా టీ20 క్రికెట్లో రాణించినట్లుగా వన్డేల్లో అతడు అద్బుత ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అయితే రాబోయే రోజుల్లో ఏదైనా జరగొచ్చు' అని విరాట్ కోహ్లీ అన్నాడు. 2019లో ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి జులై 15 వరకు వరల్డ్ కప్ జరగనుంది.
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత వన్డే జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రహానే, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, జాస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, అక్షర్ పటేల్, మొహమ్మద్ షమి, శార్తుల్ ఠాకూర్.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.