
అహ్మదాబాద్: ఇంత వేగంగా ముగిసిన టెస్టు మ్యాచ్లో తాను ఇప్పటి వరకూ ఆడలేదు అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మొతేరా వేదికగా ఇంగ్లండ్తో ముగిసిన మూడో టెస్టులో తనకి పనిభారం పెరిగిందని పేసర్ జస్ప్రీత్ బుమ్రా తనతో చెప్పినట్లు కోహ్లీ వెల్లడించాడు. తనకు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదని ఇషాంత్ శర్మ ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా చెప్పుకొచ్చాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన డేనైట్ టెస్ట్ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోపే ముగిసిన విషయం తెలిసిందే. స్పిన్కు అనుకూలించే పిచ్పై భారత బౌలర్లు చెలరేగారు.
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. 'మూడో టెస్టు మ్యాచ్ సమయంలో తనకి పని భారం పెరిగిందని జస్ప్రీత్ బుమ్రా నాతో అన్నాడు. ఇషాంత్ శర్మ అయితే ఏకంగా ఆవేదన వ్యక్తం చేశాడు. నేను 100వ టెస్టు ఆడుతున్నా, కానీ నాకు బౌలింగ్ అవకాశం ఇవ్వడం లేదన్నాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్.. మ్యాచ్ మొత్తానికీ కేవలం 3 బంతులు మాత్రమే బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్లోనూ అతనికి పెద్దగా అవకాశం రాలేదు. ఇంత వేగంగా ముగిసిన టెస్టు మ్యాచ్లో నేను ఇప్పటి వరకూ ఆడలేదు' అని అన్నాడు.
డే/నై టెస్టులో స్పిన్కు అనుకూలించే పిచ్పై పేసర్ జస్ప్రీత్ బుమ్రా కేవలం 6 ఓవర్లే బౌలింగ్ చేశాడు. 100వ టెస్టు ఆడిన ఇషాంత్ శర్మ అయితే 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. స్పిన్కి మొతేరా పిచ్ బాగా అనుకూలించడంతో.. రెండో ఇన్నింగ్స్లో బుమ్రా, ఇషాంత్ ఒక్క ఓవర్ కూడా వేయలేదు. ఫీల్డింగ్కే పరిమితమైన వారు.. మైదానంలోనే తనతో సరదాగా పనిభారం గురించి మాట్లాడినట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఓవర్లు బౌలింగ్ చేశారు. అక్షర్ 11, అశ్విన్ 7 వికెట్లు పడగొట్టాడు.
నాలుగో టెస్టు మొతేరా స్టేడియంలోనే మార్చి 4న ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల సిరీస్లో కోహ్లీసేన 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే వ్యక్తిగత కారణాలతో నాలుగో టెస్టుకి జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. చివరి టెస్టుకు కూడా భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. ఇక మూడో టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో.. నాలుగో టెస్టుకి బ్యాటింగ్ పిచ్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.