హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు కోహ్లీ పేరు నామినేట్ చేశారు. అతనితో పాటుగా వెయిట్ లిఫ్ఠర్ సాయిఖోమ్ మీరాభాయి ఛానుతో పాటు షట్లర్ కిదాంబి శ్రీకాంత్లు కూడా అదే అవార్డుకు నామినేట్ అయ్యారు. శ్రీకాంత్ పేరును స్వయంగా క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం మేరకే రికమెండ్ చేయబడిందట.
కెప్టెన్ కోహ్లీ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదిస్తే గనుక విరాట్ మూడో ఈ అవార్డుకు ఎంపికైన మూడో క్రికెటర్గా రికార్డులకెక్కనున్నాడు. గతంలో సచిన్ టెండూల్కర్(1997), ఎంఎస్ ధోనీ(2007)ల తర్వాత కోహ్లీ(2018)గా నిలవనున్నాడు. మీరా భాయి చాను ప్రపంచ ఛాంపియన్షిప్ 48 కేజీల విభాగంలో స్వర్ణాన్ని దక్కించుకొని అందరి మన్ననలు పొందింది.
దాంతో పాటు కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణంతో మెరిసింది చాను. అదే పరంపరను కొనసాగించాలని ప్రయత్నించిన చానుకు ఆసియా గేమ్స్లో నిరుత్సాహమే మిగిలింది. గాయం కారణంగా టోర్నీలో ఆడలేకపోయింది. ఒకవేళ ఈ అవార్డు చానును వరిస్తే మాత్రం వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరీ(1995), నమీరక్పం కుంజరని(1996)ల అడుగుజాడల్లో నడిచినట్లవుతుంది.
'ఖేల్రత్న కోసం బీసీసీఐ కోహ్లీ పేరు పంపడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది కూడా ఈ అవార్డు కోసం కోహ్లీ పేరు పంపగా రియో ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మలిక్, తృటిలో పతకం కోల్పోయిన దీప కర్మాకర్కు అందించారు. అందుకే ఈ ఏడాది కోహ్లీ పేరును పంపించాం' అని రాయ్ వివరించారు.