
అహ్మదాబాద్: మొతేరా వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు విరాట్ కోహ్లీ కెరీర్లో కెప్టెన్గా 60వ మ్యాచ్గా నిలిచింది. దీంతో అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన టీమిండియా కెప్టెన్గా ఎంఎస్ ధోనీ (60 మ్యాచ్లు) రికార్డును కోహ్లీ సమం చేశాడు. మహీ టీమిండియాకు కెప్టెన్గా 7 సంవత్సరాలు చేసి 60 టెస్ట్ మ్యాచ్లకు సారథ్యం వహించాడు. 2014లో ధోనీ టెస్టులకు గుడ్ బై చెప్పడంతో కోహ్లీ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అప్పటినుంచి 2021 వరకు కోహ్లీ భారత్ తరఫున 60 టెస్ట్ మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు.
కెరీర్లో కెప్టెన్గా 60వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ.. టాస్ సమయంలో ఆ విషయంపై స్పందించాడు. భారత జట్టుకు ఇంతకాలం కెప్టెన్గా కొనసాగడం నమ్మశక్యంగా లేదన్నాడు. తన సారథ్యంలో భారత జట్టు టెస్టు క్రికెట్లో మంచి ఫలితాలు సాధించిందని చెప్పాడు. టీమిండియాలో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారని, వాళ్లంతా తన దృష్టిని ఆకర్షించారన్నాడు. నాలుగో టెస్టులో భారత్ ఇంకా మెరుగ్గా ఆడాల్సి ఉందని కోహ్లీ చెప్పాడు.
గతవారం డేనైట్ టెస్టులో భారత్ విజయం సాధించడంతో స్వదేశంలో అత్యధిక టెస్టు విజయాలు (22) సాధించిన సారథిగానూ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. గతంలో ఇది ఎంఎస్ ధోనీ (21) పేరిట ఉండేది. ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే.. అత్యధిక విజయాలు సాధించిన టెస్టు సారథుల్లో గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41)ల తర్వాతి స్థానంలో ఉన్న క్లైవ్ లాయిడ్ (36)ను విరాట్ సమం చేస్తాడు. మరో 17 పరుగులు చేస్తే.. కెప్టెన్గా 12000 అంతర్జాతీయ పరుగులు కోహ్లీ పూర్తి చేసుకుంటాడు. విరాట్ కన్నా ముందు రికీ పాంటింగ్ (15440), గ్రేమ్ స్మిత్ మాత్రమే (14878) ఈ ఘనత సాధించారు.
ఈరోజు ప్రారంభం అయిన నాలుగో టెస్ట్ తొలి సెషన్లోనే విరాట్ కోహ్లీ, బెన్ స్టోక్స్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. జో రూట్ ఔటైన తర్వాత స్టోక్స్ బ్యాటింగ్కు దిగాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్.. స్టోక్స్కి షార్ట్ లెంగ్త్ రూపంలో వరుసగా బంతుల్ని సంధిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో స్టోక్స్కు సిరాజ్ ఓ బౌన్సర్తో గట్టి సవాలు విసిరాడు. ముందుగా సిరాజ్ను స్టోక్స్ ఏదో అన్నాడు. సిరాజ్ కూడా అదే రీతిలో బదులిచ్చాడు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధాన్ని గమనించిన కోహ్లీ.. ఆ ఓవర్ ముగిసిన తర్వాత స్వయంగా రంగంలోకి దిగాడు. కాసేపు స్టోక్స్తో వాదించాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఫీల్డ్ అంపైర్లు కలగజేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పారు.