న్యూఢిల్లీ: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి అండగా నిలిచారు. వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ విఫలమవ్వడం, అనుష్క శర్మ అక్కడికి రావడంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో, కోహ్లీపై విమర్శలు చేయడం తగదన్నారు.
ఆస్టేలియాలో జరిగిన పర్యటనలో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడని అన్నారు. ఆసీస్ గడ్డపై టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసి 700 పరుగులు సాధించడం అసాధారణ విషయమని అన్నారు. అతనికి పనిపట్ల నిబధ్దత ఉందన్నారు. విరాట్ కోహ్లీ గుండె భారత్ కోసమే కొట్టుకుంటుందన్నారు.
కెప్టెన్గా, వికెట్ కీపర్గా రాణిస్తున్న మహేంద్ర సింగ్ ధోనిపై కూడా రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యిన తర్వాత కూడా ధోని అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడారు. ఇప్పటికీ ఫిట్గా ఉన్నాడని, బ్యాటింగ్పై వర్క్ చేయాల్సి ఉందన్నాడు.

వరల్డ్ కప్ సెమీ పైనల్ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడిపోవడమే అభిమానులను నిరాశకు గురి చేసిందని ఈ మాజీ ఆటగాడు వ్యాఖ్యానించాడు. టోర్నమెంట్లో అత్యంత అధ్బుతంగా టీమిండియా తన ప్రదర్శనను కనబరిచిందని పేర్కొన్నాడు.
ఇప్పటికీ ఆస్టేలియాను ఓడించగలిగే సత్తా ఒక్క టీమిండియాకు మాత్రమే ఉందని, ఆ విషయం ఆసీస్కు తెలుసని అన్నాడు. సెమీ పైనల్ మ్యాచ్లో భారత్ విజయావకాశాలను ఆస్టేలియా యువ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ రూపంలో అడ్డుపడ్డాడని తెలిపాడు.
ఇక టోర్నమెంట్లో టీమిండియా బౌలర్లు ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ చక్కగా రాణించారని తెలిపారు. కోల్కత్తా నవాబ్గా షమీని, విదర్భ నుంచి ఉమేష్, రాజధాని కంటే వేగంగా హర్యానా ఎక్స్ప్రెస్ లాగా మెహిత్ శర్మ బౌలింగ్ వేశారని అన్నారు. 2019 వరల్డ్ కప్లో టీమిండియా అద్భుతమైన యువ ఆటగాళ్లతో 80 శాతం రాటుతేలుతుందని అన్నారు.