
హైదరాబాద్: తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆటగాడిగా మాత్రమే కాకుండా కెప్టెన్గా కూడా భారత జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించాడు.
మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా పేరొందిన విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. తద్వారా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ఫుల్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీల తర్వాత మేడమ్ టుస్సాడ్స్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోన్న ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
ఇప్పటికే లండన్ నుంచి వచ్చిన టుస్సాడ్స్ మ్యూజియం కళాకారులు విరాట్ కోహ్లీ కొలతలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఇమేజిలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై కోహ్లీ మాట్లాడుతూ 'మేడమ్ టుస్సాడ్స్లో నా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఎంతో ఓపికతో నా కొలతలు తీసుకొని, నాకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని మేడమ్ టుస్సాడ్స్ సిబ్బందికి నా ధన్యవాదాలు' అని అన్నాడు.

2008లో కోహ్లీ నేతృత్వంలోని అండర్-19 జట్టు వరల్డ్ కప్ను సాధించడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత భారత జాతీయ జట్టులో అడుగుపెట్టిన కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించాడు. ఇప్పటివరకు ఐసీసీ వరల్డ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, మూడు సార్లు బీసీసీఐ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు.