
ఢిల్లీ: టీమిండియా ప్రపంచకప్లో సెమీస్ నుండే నిష్క్రమించినా.. అనంతరం జరిగిన విండీస్ పర్యటనలో అద్భుత ఆటతో ఆకట్టుకుంది. విండీస్ పర్యటనలో భాగంగా జరిగిన టీ20, వన్డే, టెస్ట్ సిరీస్లను కైవసం చేసుకుంది. ఈ పర్యటనలో టీమిండియా ఒక్క ఓటమిని కూడా చూడలేదు. దీంతో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి పరిపూర్ణం చేసింది.
వెస్టిండీస్ పర్యటన తర్వాత కోహ్లీ సేన ప్రస్తుతం స్వల్ప విరామం పొందుతుంది. ఆటగాళ్లు అందరూ కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. సెప్టెంబర్ 15 నుంచి భారత్ 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సేన సెప్టెంబర్ 12న దేశ రాజధాని న్యూఢిల్లీలో సమావేశం అవనుందని సీనియర్ బోర్డు అధికారి ఒకరు ఓ ప్రకటనలో తెలిపారు.
'సెప్టెంబర్ 15 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. బుధవారంతో విరామం ముగుస్తుంది. మరుసటి రోజు ధర్మశాలకు వెళ్లే ముందు కోహ్లీ సేన గురువారం న్యూఢిల్లీలో సమావేశం అవుతుంది. సంజయ్ బంగర్ స్థానంలో కొత్తగా ఎంపికయిన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా జట్టుతో కలుస్తాడు. మిగిలిన కోచింగ్ స్టాఫ్ కూడా ఉంటారు' అని ఆ అధికారి పేర్కొన్నారు.
సెప్టెంబర్ 15న ధర్మశాలలో తొలి టీ20, 18న మొహాలిలో రెండవ టీ20, 22న బెంగళూరులో మూడవ టీ20 జరగనుంది. సీనియర్ పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ లకు విశ్రాంతి ఇవ్వగా.. వెస్టిండీస్ సిరీస్ కోసం విశ్రాంతి తీసుకున్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చాడు. సెలెక్షన్ కమిటీ యువకులకు అవకాశం ఇచ్చింది. ఆటగాళ్లపై పనిభారం పడకుండా సెలెక్షన్ కమిటీ కూడా చాలా జాగ్రత్తగా ఉంది. ఈ సిరీస్ కోసం ప్రొటీస్ జట్టు ఇప్పటికే భారత్ చేరుకుంది.