|
ఎడ్జ్బాస్టన్ వేదికగా బుధవారం తొలి టెస్టు
ఇంగ్లాండ్ పర్యటనలో ఇప్పటికే టీ20 సిరిస్ను కైవసం చేసుకున్న కోహ్లీసేన, మూడు వన్డేల సిరిస్ను 1-2తేడాతో చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా టెస్టు సిరీస్ను సొంతం చేసుకోవాలని కసితో కోహ్లీసేన ఉంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు బుధవారం ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే తొలి టెస్టు ఇంగ్లాండ్కు ఎంతో ప్రత్యేకం కానుంది. ఆతిథ్య ఇంగ్లాండ్కు ఇది 1000వ టెస్టు.
1000 టెస్టులాడిన తొలి జట్టుగా ఇంగ్లాండ్
దీంతో 1000 టెస్టుల ఆడిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించనుంది. ఇంగ్లాండ్ జట్టు 1877లో తన తొలి టెస్టును ఆస్ట్రేలియాతో ఆడింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన ఈ టెస్టులో జేమ్స్ లిల్లీవైట్ సారథ్యం వహించాడు. మొత్తం 999 టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు 357 మ్యాచ్లలో విజయం సాధించగా... 297 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. 345 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఇప్పటి వరకు 999 టెస్టులాడిన ఇంగ్లాండ్ అత్యధిక టెస్ట్ మ్యాచ్లాడిన జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
1932లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు
కాగా, భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జూన్, 1932లో జరిగింది. ఇక, తొలి టెస్టు మ్యాచ్ ఆరంభానికి ముందు ఐసీసీ మ్యాచ్ రిఫరీ ప్యానెల్లో సభ్యుడు, మాజీ న్యూజిలాండ్ కెప్టెన్ జెఫ్ క్రౌన్కు ఐసీసీ తరుపున ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ కోలిన్ గ్రేవ్స్ వెండి ఫలకాన్ని బహుకరించనున్నారు.
|
ఎడ్జ్బాస్టన్ మైదానం
ఎడ్జ్బాస్టన్ మైదానం ఇంగ్లాండ్కు ఎంతో కలిసొచ్చిన మైదానం. 2005 నుంచి ఇప్పటి వరకు ఈ మైదానంలో 10 టెస్టులు ఆడగా ఏడింట్లో విజయం సాధించి, ఒక టెస్టును డ్రా చేసుకుంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడిన భారత్ ఒక్క విజయం కూడా సాధించకపోవడం విశేషం. కేవలం ఒకే ఒక్క టెస్టును డ్రాగా ముగించింది.