
హైదరాబాద్: భారత క్రికెటర్ల జీతాలు భారీగా పెరగనున్నాయి. అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు దేశవాళీ క్రికెటర్ల జీతాలు కూడా రెట్టింపు అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఆటగాళ్లకు ఇస్తున్న వేతన విధానానికి అదనంగా మరో రూ. 200 కోట్లను చేర్చేలా సుప్రీం కోర్టు నియమించిన కమిటీ త్వరలో బీసీసీఐకి ఓ నివేదికను అందచేయనుంది.
ఈ నివేదికను త్వరలో జరగనున్న బీసీసీఐ జనరల్ బాడీ సమావేశంలో వినోద్ రాయ్ నేతృత్వంలోని సీఓఏ బీసీసీఐ ముందు ఉంచుతుంది. ఇందుకు బీసీసీఐ అంగీకరిస్తే, ఆటగాళ్ల జీతాలు రెట్టింపు అవుతాయి. ప్రస్తుతం ఆటగాళ్ల జీతాల కోసం బీసీసీఐ రూ. 180 కోట్లు కేటాయిస్తుస్తోంది.
ఈ మొత్తం రూ.180 కోట్ల నుంచి రూ.380 కోట్లకు చేరుతుంది. సీఓఏ పెంచిన మొత్తాన్ని సీనియర్, జూనియర్ క్రికెటర్లకు జీతాలు పెంచుతారు. ఆటగాళ్ల జీతాలు పెంచాలని టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోని సీఓఏని కలిసి రెండు వారాల క్రితం నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీఓఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐకి వచ్చే వార్షిక ఆదాయంలో సుమారు 26 శాతం ఆటగాళ్లకు వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. అందులో అంతర్జాతీయ క్రికెటర్లకు 13 శాతం, దేశవాళీ క్రికెటర్లకు 10.6 శాతం, మహిళలు, జూనియర్లకు 2.4 శాతం ఇస్తున్నారు.
ఒకవేళ సీఓఏ ప్రతిపాదనకు ఆమోదం దక్కితే, కోహ్లీ లాంటి ప్లేయర్ల జీతం రూ.10 కోట్లకు పెరుగుతుంది. 2017లో అతను 46 మ్యాచ్ల ద్వారా రూ.5.51 కోట్లు ఆర్జించాడు. రంజీ ఆటగాళ్ల జీతం రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెరుగుతుంది. అంతర్జాతీయ, దేశవాళీ ఆటగాళ్ల జీతాల పెరుగుదల శాతం ఒకేలా ఉంటుందని అంటున్నారు.