హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నాయి. ఇరు జట్ల మధ్య తొలి టీ20 ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఢిల్లీలో ఓ రెస్టారెంట్ ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు జట్టులోని ఆటగాళ్లంతా మంగళవారం రాత్రి కోహ్లీకి చెందిన 'నుయేవా రెస్టారెంట్'లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
రెస్టారెంట్లోని పుడ్, సర్వీస్ చాలా బాగున్నాయని ధావన్ తన ఇనిస్టాగ్రామ్లో పేర్కొన్నాడు.
ఇక, ఈ రెస్టారెంట్కు వచ్చినవారు తప్పకుండా కోల్డ్ పిజ్జా ట్రై చేయండి అని అక్షర్ పటేల్ ట్విట్టర్లో అభిమానులకు సూచించాడు. అనంతరం రెస్టారెంట్ సిబ్బందితో కలిసి భారత ఆటగాళ్లు ఫొటోలు దిగుతూ సందడి చేశారు.
ఇదిలా ఉంటే మూడు టీ20ల సిరిస్లో భాగంగా తొలి టీ20 బుధవారం రాత్రి 7 గంటలకు ఫిరోజ్షా కోట్లా మైదానం ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఇప్పటివరకు కోహ్లీసేన స్వదేశంలో రెండు టీ20 సిరీస్లు రెండు మాత్రమే అడింది. అందులో ఒకటి జనవరిలో ఇంగ్లాండ్తో జరిగిన మూడు టీ20ల సిరిస్ కాగా, రెండోది గత నెలలో ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు టీ20ల సిరిస్.
ఈ రెండు టీ20 సిరీస్ల్లో భారత్కు ప్రత్యర్థి జట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ను 2-1తో గెలిచిన కోహ్లీ సేన, ఆస్ట్రేలియాతో జరిగిన సిరిస్ను మాత్రం 1-1తో సమం చేసుకుంది. హైదరాబాద్లో జరగాల్సిన చివరి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లు సిరిస్ను పంచుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కూడా ఈ మూడు టీ20ల సిరిస్లో గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. అంతేకాదు న్యూజిలాండ్తో తలపడిన ఏ టీ20లోనూ భారత్కు విజయం సాధించలేదు. 2007 నుంచి చూస్తే కివీస్తో భారత్ ఐదు టీ 20ల్లో తలపడగా అన్నింట్లోనూ ఓటమి పాలైంది. వరల్డ్ టీ 20ల్లో భాగంగా గతేడాది న్యూజిలాండ్తో ఆడిన ఆఖరి మ్యాచ్లో కూడా కోహ్లీసేన ఓటమి పాలైంది.
దీంతో ఫిరోజ్ షా కోట్లాలో తొలి మ్యాచ్ గెలిచి ఖాతా తెరవాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి టీ20కి ఆతిథ్యమిస్తోన్న ఫిరోజ్ షా కోట్లాలో ఇప్పటివరకు నాలుగు అంతర్జాతీయ టీ20లు మాత్రమే జరిగాయి. గతేడాది టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇంగ్లండ్-అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఇక్కడ తొలి మ్యాచ్ జరిగింది. ఆ వరల్డ్ కప్లో మూడు గ్రూప్ మ్యాచ్లతో పాటు ఒక సెమీస్ ఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యమిచ్చింది. బుధవారం కివీస్తో జరగనున్న టీ20నే ఈ స్టేడియంలో భారత్కు తొలి టీ20 కావడం విశేషం.