
హైదరాబాద్: న్యూఢిల్లీలో గురువారం CNN IBN Indian of the Year 2017 అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇటీవల మిస్ వరల్డ్ 2017గా ఎంపికైన మానుషి చిల్లర్తో పాటు పలు రంగాలకు చెందిన వారు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లీని మానుషి చిల్లర్ ఓ ప్రశ్న వేసింది. 'ముందుగా నీకు శుభాకాంక్షలు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో అగ్రస్థానంలో ఉన్నావు. ఎందరో యువ క్రికెటర్లు నిన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. వీరికి నువ్వు ఇచ్చే సలహాలు ఏమిటి. ముఖ్యంగా చిన్నారులకు మీరిచ్చే సందేశం ఏమిటి' అని కోహ్లీని చిల్లర్ అడిగింది.
దీనికి విరాట్ కోహ్లీ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'ఫీల్డ్లో ఎప్పుడు, ఏం చేయాలి అనేది చాలా ముఖ్యం. అది చాలా కచ్చితత్వంతో ఉండాలి. మన ఆలోచన గుండెల్లోంచి రావాలి. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షుకులకు నమ్మశక్యంగా అనిపించాలి. ఏదో నటిస్తున్నట్లు వారికి అనిపించకూడదు. ఒకవేళ అలా జరిగితే వారు ఎప్పుడూ మనల్ని నమ్మరు. మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి. నా గురించి ఎవరు ఏమీ అన్నా పట్టించుకోను. నా పని సక్రమంగా చేయడమే నాకు తెలిసింది. దానిని నమ్ముతా. అదే యువతకు నేనిచ్చే సందేశం' అని కోహ్లీ బదులిచ్చాడు.
అంతకముందు విరాట్ కోహ్లీ... చిల్లర్కు స్పెషల్ అవార్డు కింద బహుమతిని అందించాడు. 'ఎప్పుడైనా నేను మారాలనే ఆలోచన వస్తుందో ఆ క్షణమే నేను మార్పుని స్వాగతిస్తా. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎంతో ఉన్నతంగా ఆలోచించాలి. ఈ క్రమంలో వారు తమ గుర్తింపు, క్యారెక్టర్, వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు' అని తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.