లాహోర్: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరాభిమానిని పాకిస్థాన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఒకారా జిల్లాకు చెందిన ఉమర్ ద్రాజ్, భారత బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ తన ఇంటిపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు.
లాహోర్కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న అతడు మంగళవారం తన ఇంటి కప్పుపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేయడంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతని ఇంటిపై దాడులు చేసి, ఇంటిపై కప్పుమీద ఎగురుతున్న భారత జెండాను స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారి మహ్మద్ జమిల్ తెలిపారు.

అంతేకాదు అతన్ని అరెస్టు చేసి, మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టామని, కోర్టు అతనికి కస్టడీ విధించిందని ఆయన వివరించారు. అయితే, విరాట్ కోహ్లికి తాను వీరాభిమానినని, అతనిపై అభిమానం చాటుకునేందుకే భారత జాతీయ జెండాను తన ఇంటి పైకప్పు మీద ఎగురవేశానని ఉమర్ ద్రాజ్ మీడియాకు తెలిపాడు.
అయితే తాను చేసింది తప్పు అనే విషయం తనకు తెలియదని, తనను క్షమించి వదిలిపెట్టాలని ఆయన పోలీసు అధికారులను కోరారు. తాను కేవలం టీమిండియా క్రికెట్ వీరాభిమానేనని, తాను గూఢచారిని కాదన్నాడు. ఉమర్ ద్రాజ్ ఇంట్లో విరాట్ కోహ్లీకి చెందిన పోస్టర్ సైజు ఫోటోగ్రాఫులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.