నేను కాదు.. నా బ్యాట్ మాట్లాడుతుంది
ఓవర్నైట్ వ్యక్తిగత స్కోరు 82తో ఆదివారం ఆటని కొనసాగించిన విరాట్ కోహ్లీ.. 214 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టు కెరీర్లో కోహ్లీకి ఇది 25వ సెంచరీ కాగా.. ఆస్ట్రేలియాపై 7వ సెంచరీ. శతక అభివాదంలో ‘నేను కాదు.. నా బ్యాట్ మాట్లాడుతుంది' అని అర్థం వచ్చేలా విరాట్ కోహ్లీ సంజ్ఞలు చేయడం విశేషం.
ఆఫ్ స్టంప్కి వెలుపల బంతులు విడిచిపెడుతూ
ఆఫ్ స్టంప్కి వెలుపల ఊరిస్తూ బంతులు విసిరినా.. సహనంతో వాటిని విడిచిపెడుతూ.. ఇన్నింగ్స్ని నిర్మించాడు. ఈ క్రమంలో.. పుజారాతో కలిసి మూడో వికెట్కి 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ.. ఆ తర్వాత రహానెతో నాలుగో వికెట్కి 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.
మిడాఫ్ దిశగా బంతిని బౌండరీకి తరలించి
శనివారం పాట్ కమిన్స్ బౌలింగ్లో కట్షాట్ కొట్టి.. 109 బంతుల్లో 50 పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లి.. ఆదివారం మిచెల్ స్టార్క్ బౌలింగ్లో మిడాఫ్ దిశగా బంతిని బౌండరీకి తరలించి సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. తద్వారా టెస్ట్ల్లో అత్యంత వేగంగా 25 సెంచరీలు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాట్స్మన్గా కోహ్లి గుర్తింపు పొందాడు.

కోహ్లీని దాటే అవకాశం స్మిత్ ఒక్కడికే
76 మ్యాచ్లు.. 128 ఇన్నింగ్స్లో కోహ్లి ఈ ఘనత సాధించగా.. దిగ్గజ క్రికెటర్ బ్రాడ్మన్ 52 మ్యాచ్లు.. 68 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఫీట్ను నమోదు చేశాడు. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ 130 ఇన్నింగ్స్ల్లో.. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ 138 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనతను అందుకొని కోహ్లి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక కోహ్లి రికార్డును అధిగమించడానికి ఆసీస్ క్రికెటర్ స్టీవ్స్మిత్కే అవకాశం ఉంది. 117 ఇన్నింగ్స్ల్లోనే 23 సెంచరీలు పూర్తి చేసిన స్మిత్.. బాల్ట్యాంపరింగ్ వివాదంతో ఆటకు దూరమైన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications
