హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల దాహం తీరనిదని, గొప్ప ఆటగాళ్లకు ఉండే లక్షణమే అదని మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్లో గ్యారీ కిర్స్టెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సహాయక కోచ్గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
గురువారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో గ్యారీ కిర్స్టెన్ మాట్లాడుతూ 'విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. నిరంతరం మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. నిత్యం ఆట గురించి నేర్చుకునే కోహ్లీతో పనిచేయడాన్ని నేనెంతో ఆస్వాదిస్తా. గొప్ప ఆటగాళ్లంతా అలాగే చేస్తారు' అని తెలిపాడు.
ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కౌంటీ క్రికెట్ ఆడాలన్న కోహ్లీ నిర్ణయాన్ని కిర్స్టెన్ అభినందించాడు. 'ఇంగ్లాండ్ పర్యటనకు ముందుగానే సన్నద్ధం కావడం అతనికి ఎంతో మంచిది. ప్రతి ఆటగాడికి సన్నద్ధం చాలా అవసరం. భారత్, ఇంగ్లాండ్ సిరీస్ పోటాపోటీగా జరుగుతుంది. దీని గురించి నేను ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' అని అన్నాడు.
కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)వల్ల ఎంతో ముంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారని కిరెస్టన్ తెలిపాడు. 'భారత్లో క్రికెట్ ప్రతిభ చాలా ఉంది. చిన్న ఊర్ల నుంచి పెద్ద పట్టణాల వరకు నైపుణ్య ఆటగాళ్లకు గుర్తింపు లభిస్తుంది' అని ఈ సందర్భంగా గ్యారీ కిరెస్టన్ వెల్లడించాడు.