
ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ సురేశ్ బాత్రా కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. గురువారం గుండెపోటుతో సురేశ్ మరణించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సురేశ్ బాత్రా తన రోజువారీ ప్రార్థనల తరువాత ఇంట్లోనే కుప్పకూలిపోయారని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ లోకపల్లి తెలిపారు. సురేశ్ ప్రస్తుతం ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అసిస్టెంట్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఆయన మరణంతో ఢిల్లీ క్రికెట్లో విషాదచాయాలు అలుముకున్నాయి.
విరాట్ కోహ్లీ టీనేజ్ వయసులో ఉన్నప్పుడు సురేశ్ బాత్రా అతనికి బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించారు. విరాట్ బ్యాటింగ్ స్టైల్లో మార్పు రావడంలో సురేశ్ కీలకపాత్ర పోషించారు. కోహ్లీతో పాటు 2018 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన మన్జోత్ కల్రాకు కూడా బత్రా కోచింగ్ ఇచ్చారు. కోహ్లీ ఢిల్లీ తరఫున రాజ్కుమార్ శర్మ, సురేష్ కోచింగ్ పర్యవేక్షణలో ఎన్నో ఘనతలు సాధించాడు. అంచెలంచెలుగా ఎదిగి 2008లో టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు.
ఢిల్లీ క్రికెట్ అకాడమీలో హెడ్ కోచ్గా ఉన్న రాజ్కుమార్ శర్మ ట్విటర్లో స్పందించారు. సొంత సోదరుడిని కోల్పోయినట్లుగా ఉందని సంతాపం తెలిపారు. 'నేను ఈరోజు నా తమ్ముడిని కోల్పోయాను. సురేశ్బాత్రాతో నాకు 1985 నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందరో క్రికెటర్లను తయారు చేసిన సురేశ్.. విరాట్ కోహ్లీకి కూడా కోచ్గా వ్యవహరించాడు. అతని మృతి మాకు తీరని లోటు. సురేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రర్శిస్తున్నా' అంటూ రాజ్కుమార్ శర్మ ట్వీట్ చేశారు.
2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 91 టెస్టులాడి 52.4 సగటుతో 7490 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 రన్స్ బాదాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 రన్స్ చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 22 వేలకు పైగా పరుగులు చేశాడు.