
ముంబై: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ను విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ హెచ్చరించారు. పంత్కు ఇది అత్యున్నత సమయం, అతను చాలా జాగ్రత్తగా ఉండాలి అని రాజ్కుమార్ హెచ్చరించారు. తనకెంతో ఇష్టమైన టీ20 ఫార్మాట్లో షాట్లను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని సూచించాడు.
ప్రపంచకప్లో కీలక సెమీస్ మ్యాచ్లో చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. వెస్టిండీస్ సిరీస్లో తనకు అలవాటైన చెత్త షాట్లకు ఔటైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో టెస్టుల్లో శతకాలు బాదిన భారత తొలి వికెట్కీపర్గా రికార్డు సృష్టించిన పంత్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం విఫలమవుతున్నాడు. రెండో టీ20లో కూడా పంత్ అదే షాట్ ఆడి ఔట్ అయ్యాడు. దీంతో పంత్పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజ్కుమార్ స్పందించారు.
'పంత్కు ఇది అత్యున్నత సమయం. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. టీ20 అతడికి ఇష్టమైన ఫార్మాట్ అయినా తనదైన ముద్ర కనబరచలేదు. పంత్లో అద్భుత ప్రతిభ ఉంది. అతడి వద్ద మంచి షాట్లు ఉన్నాయి. మ్యాచ్లను గెలిపించగలడు. కానీ.. దురదృష్టవశాత్తు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అతడి గురించి నేను ఆందోళన పడుతున్నా. పంత్ ఆడుతున్న విధానం ప్రమాద హెచ్చరికలు జారిచేస్తోంది. కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ చేసిన వ్యాఖ్యలు పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటికైనా అతడు మంచి ఇన్నింగ్స్లు ఆడాలని కోరుకుంటున్నా' అని రాజ్కుమార్ అన్నారు.
ఇక టీమిండియా జట్టుపై రాజ్కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. 'కోహ్లీసేన అత్యంత నిలకడగా ఆడుతోందది. గత 20 ఏళ్లలో భారత జట్టు ఇలా ఆడటం తానెన్నడూ చూడలేదు. రవిశాస్త్రి మాటలతో ఏకీభవిస్తున్నా. అతడు అన్నట్లు కోహ్లీసేన కచ్చితంగా అత్యుత్తమ పర్యాటక జట్టే. టీమిండియా దక్షిణాఫ్రికాపై సులభంగా టీ20 సిరీస్ కైవసం చేసుకుంది' అని రాజ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు.