ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ఆర్సీబీ అదరగొట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. ఇషాన్ కిషన్ (80) మెరుపు ఇన్నింగ్స్ సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రతాపానికి ఎస్ఆర్హెచ్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. టార్గెట్ ఎంత భారీగా ఉన్నా ఛేజ్ మాస్టర్ క్రీజులో ఉంటే అది సాధ్యమేనని మరోసారి నిరూపితమైంది. 15.4 ఓవర్లలోనే ఆర్సీబీ దీన్ని ఛేదించింది. 200, అంత కంటే ఎక్కువ పరుగులను అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సరికొత్త రికార్డు సృష్టించింది.
కింగ్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్ విధ్వంసం
202 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బ్యాటర్లు ఆరంభం నుంచే విరుచుకుపడ్డారు. దేవదత్ పడిక్కల్ కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేసి బలమైన పునాది వేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పటిదార్ కేవలం 12 బంతుల్లోనే 31 రన్స్ చేసి రన్ రేట్ను అదుపులో ఉంచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. విరాట్ కోహ్లీ మాత్రం పట్టు వదలకుండా అంగదుడి పాదంలా క్రీజులో పాతుకుపోయాడు. కింగ్ కోహ్లీ కేవలం 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 69 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. టెస్టులు, టీ20లకు కాస్త బ్రేక్ ఇచ్చినప్పటికీ కోహ్లీలో ఏ మాత్రం పదును తగ్గలేదని ఈ ఇన్నింగ్స్ నిరూపించింది.

కోహ్లీ -అనుష్కల మూమెంట్ వైరల్
మ్యాచ్ ముగిసిన వెంటనే స్టేడియంలో ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఆర్సీబీ విజయం సాధించగానే విరాట్ కోహ్లీ గ్యాలరీలో తన కోసం చీర్ చేస్తున్న భార్య అనుష్క శర్మ వైపు చూస్తూ 'ఫ్లయింగ్ కిస్' ఇచ్చాడు. దీనికి అనుష్క కూడా ఆలస్యం చేయకుండా అదే రీతిలో ఫ్లయింగ్ కిస్ తిరిగి ఇచ్చింది. ఈ రొమాంటిక్ సెలబ్రేషన్ చూసి స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఆ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చి అనుష్క పక్కనే ఉన్న మహిళా టీమిండియా క్వీన్, ఆర్సీబీ మహిళా కెప్టెన్ స్మృతి మంధాన ఆశ్చర్యంగా చూడటం అందులో రికార్డయింది. ఈ మ్యాచ్ చూసేందుకు మహిళా క్రికెటర్లు శ్రేయాంక పాటిల్, జెమిమా రోడ్రిగ్స్ కూడా రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం కోహ్లీ సెలబ్రేషన్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.