
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో గత 21 రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ప్రణబ్.. సోమవారం సాయంత్రం మృతి చెందారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో గుండె పోటుతో ప్రణబ్ మరణించారని వైద్యులు ప్రకటించారు. ప్రణబ్ ముఖర్జీ మృతికి పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్లు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం ట్విట్టర్ వేదికగా తన సంతాపాన్ని వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2020 కోసం యూఏఈలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి.. భారతదేశం అద్భుతమైన నాయకుడిని కోల్పోయిందని ట్వీట్ చేశాడు. 'దేశం ఓ అద్భుతమైన నాయకుడిని కోల్పోయింది. ప్రణబ్ ముఖర్జీ లేరన్న వార్త విన్నందుకు బాధగా ఉంది. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం' అని కోహ్లీ ట్వీట్ చేశాడు.
'రెస్ట్ ఇన్ పీస్.. ప్రణబ్ ముఖర్జీ గారు. మీరు దేశానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆయన ప్రియమైనవారికి నా సంతాపం' అని టీమిండియా స్టార్ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ట్వీటాడు.
దశాబ్దాల పాటు అకుంఠిత దీక్షతో ప్రణబ్ ముఖర్జీ దేశానికి సేవలందించారు. ఆయన మృతి విచారకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి- సచిన్ టెండూల్కర్
ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినందుకు హృదయపూర్వక సంతాపం. అతడి ఆత్మకు శాంతి కలుగుగాక- అని అనిల్ కుంబ్లే
మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినందుకు నా హృదయపూర్వక సంతాపం- వీవీఎస్ లక్ష్మణ్
ప్రణబ్ జీ మృతికి నా హృదయపూర్వక నివాళి ప్రకటిస్తున్నా- వీరేందర్ సెహ్వాగ్
ఆయన సేవలను దేశం గుర్తుంచుకుంటుంది. అందరూ ప్రేమించే నేతగా ప్రణబ్ పేరు తెచ్చుకున్నారు- గౌతమ్ గంభీర్
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరనే విషయం విచారం కలిగించింది. ఆయన మృతికి నా హృదయపూర్వక నివాళి- సైనా నెహ్వాల్
రాజకీయాల్లో అత్యున్నత నేతగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు- విజేందర్
ప్రణబ్ ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబానికి నా సానుభూతి- మేరీకోమ్
ప్రణబ్ ముఖర్జీ గారు మాకు మార్గదర్శి. దేశానికి ఆయన చేసిన సేవల చిరస్మరణీయం- క్రీడా మంత్రి కిరణ్ రిజిజు