200వ వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ
అక్టోబర్ 22, 2017న వాంఖడె స్టేడియంలో న్యూజిలాండ్-భారత జట్ల మధ్య జరిగిన వన్డే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 200వ వన్డే. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 111 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వన్డే కెరీర్లో కోహ్లీకి ఇది 31వ సెంచరీ. ఈ సెంచరీతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 30 సెంచరీల రికార్డుని కోహ్లీ అధిగమించాడు. క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా హిట్టర్ ఏబీ డివిలియర్స్ తర్వాత.. 200వ వన్డేలో సెంచరీ బాదిన క్రికెటర్గా కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు.
లాథమ్ సెంచరీతో భారత్ ఓటమి
కోహ్లీ సెంచరీతో ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. అనంతరం 281 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టు 49 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లలో లాథమ్ (103 నాటౌట్) సెంచరీ చేయగా, రాస్ టేలర్ 95 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

200వ వన్డేలో కెప్టెన్గా రోహిత్ శర్మ
ఇక, రోహిత్ శర్మ 200వ వన్డేలో కూడా న్యూజిలాండ్ విజయం సాధించింది. తన 200వ వన్డేలో రోహిత్ శర్మనే కెప్టెన్గా వ్యవహారించాడు. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 30.5 ఓవర్లలో కేవలం 92 పరుగులకే కుప్పకూలిపోయింది. స్వింగ్, బౌన్స్, సీమ్ అధికంగా ఉండడంతో భారత బ్యాట్స్మెన్ కివీస్ బౌలర్లను ఎదుర్కొనడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఒక్క బ్యాట్స్మెన్ కూడా క్రీజ్ వద్ద నిలవలేకపోయారు. బౌల్ట్ పది ఓవర్లలో 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.

చెత్త ప్రదర్శన చేసిన టీమిండియా
అనంతరం భారత్ నిర్దేశించిన 93 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో భారత జట్టుపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో రాస్ టేలర్ 37, నికోలస్ 30 పరుగులతో నాటౌట్గా నిలిచారు. మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టిన బౌల్ట్కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. దీంతో 200వ వన్డే రోహిత్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయితే, ఇప్పటికే ఐదు వన్డేల సిరిస్ను టీమిండియా 3-0 తేడాతో కైవసం చేసుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications












