మూడు వన్డేలు, మూడు నాలుగు రోజుల మ్యాచ్లు ఆడనున్న కోహ్లీ
ఈ ఒప్పందంలో భాగంగా సర్రె జట్టు తరఫున కోహ్లీ మూడు వన్డేలు, మూడు నాలుగు రోజుల మ్యాచ్లు ఆడనున్నాడు. ఈ ఒప్పందం కారణంగా ఆప్ఘనిస్థాన్తో బెంగళూరు వేదికగా జరిగే ఏకైక టెస్టు విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. దీనిపై ఇప్పటికే పలువురు విరాట్ కోహ్లీని విమర్శిస్తుండగా, మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు.
ఇంగ్లాండ్ పరిస్థితులకు కోహ్లీ అలవాటు పడతాడు
తాజాగా దీనిపై వెంగ్ సర్కార్ మాట్లాడుతూ 'కోహ్లీ తీసుకున్న నిర్ణయం సముచితమైంది. ఇంగ్లాండ్ పరిస్థితులకు అతడు అలవాటు పడతాడు. గత పర్యటన అతడికి అచ్చిరాలేదు. ఈసారి ఇంగ్లాండ్లో రాణించాలని కోహ్లీ గట్టి పట్టుదలతో ఉన్నాడు. నాలుగేళ్లుగా ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్గా గుర్తింపు పొందిన కోహ్లీ నుంచి ఇంగ్లాండ్ పర్యటనలో చాలా ఎక్కువగా ఆశిస్తాం' అని వెంగ్ సర్కార్ పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ రాణిస్తాడు
ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ రాణిస్తాడన్న నమ్మకం తనకుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక, తాను సెలక్టర్ అయి ఉంటే పుజారాని ఇంగ్లాండ్లోనే కౌంటీల్లో అలాగే ఆడుతూ ఉండమని చెప్పేవాడినని సర్కార్ తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ కౌంటీల్లో యార్క్షైర్ జట్టు తరుపున ఆడుతున్న పుజారా ఆప్ఘనిస్థాన్తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ కోసం భారత్కు రానున్నాడు.
ఇంగ్లాండ్లోనే ఉంటేనే పరుగులు చేయగలడు
‘వారంతా త్వరలో ఇంగ్లాండ్లో ఆడాల్సిన వారు. అలాంటిది అఫ్ఘనిస్థాన్తో ఆడాలని చెప్పడం ఎంతమాత్రం మంచిది కాదు. ఇప్పుడు పుజారా భారత్ తిరిగొచ్చి ఆప్ఘనిస్థాన్తో ఆడాల్సిన అవసరం ఏముంది. అతడి ఫామ్ సైతం సరిగ్గా లేదు. ఇంగ్లాండ్లోనే ఉంటేనే పరుగులు చేయగలడు' అని వెంగ్ సర్కార్ అభిప్రాయపడ్డాడు.