
ముంబై: బాలీవుడ్ హీరోయిన్, తన భార్య అనుష్క శర్మ నిర్మించిన 'బుల్ బుల్' సినిమాకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రివ్యూ ఇచ్చాడు. సినిమా తనకు చాలా నచ్చిందని, ఎవరూ మిస్ కావొద్దని విరాట్ పేర్కొన్నాడు. అన్వితాదత్ దర్శకత్వం వహించిన వెబ్ సినిమానే 'బుల్ బుల్'. నిర్మాతలలో ఒకరు అనుష్క. ఇక రాహుల్ బోస్, తృప్తి డిమ్రీ, అవినాష్ తివారీ, పరంబ్రాత ఛటోపాధ్యాయ కీలక పాత్రలు పోషించారు.
ఇటీవల విడుదల చేసిన 'బుల్ బుల్' సినిమా ట్రైలర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఇక బుధవారం నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ప్రేక్షకుల అంచనాలను అందుకున్న ఈ సినిమా.. మంచి టాక్ కూడా తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని చూసిన విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'ప్రతిఒక్కరి హృదయాల్ని కదిలించే కథ, దాన్ని తెరపై చూపించిన విధానం ఎంతో నచ్చింది. అన్నాచెల్లిళ్లు ఫైర్ మీదున్నారు (నిర్మాతలు అనుష్క, ఆమె సోదరుడు కర్ణేశ్). సినిమా విడుదలైంది. ఎవరూ మిస్ కావొద్దు' అని విరాట్ కోహ్లీ రివ్యూ ఇచ్చాడు.
32 ఏళ్ల అనుష్క శర్మ చివరిగా 'జీరో' సినిమాలో వెండితెరపై కనిపించారు. షారుక్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా.. ఆశించిన మేర ఆడలేదు. ఆపై 'అంగ్రేజీ మీడియం'లో అతిథిగా పాత్ర పోషించారు. కోహ్లీతో వివాహం అయినప్పటి నుండి అనుష్క పెద్దగా సినిమాలు చెయ్యట్లేదు. పూర్తి సమయం కోహ్లీతోనే గడుపుతోంది. మరోవైపు ఈ ఏడాది అనుష్క 'పాతాళ్లోక్', 'బుల్బుల్'ను నిర్మించారు. అయితే అనుష్క కథానాయికగా చేయనున్న కొత్త సినిమాను ప్రకటించాల్సి ఉంది.
విరుష్క జోడీ 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో మొదటిసారి కలుసుకున్నారు. ఇక 2017, డిసెంబర్ 11 విరాట్-అనుష్క ఇటలీలో వివాహం చేసుకున్నారు. అనుష్క శర్మ జీవితంలోకి ప్రవేశించాక తన దృక్ఫథం ఎంతో మారిందని ఇటీవలే విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. 'నిజాయతీగా చెప్పాలంటే అనుష్క శర్మతో పరిచయం నాలో చాలా మార్పులకు కారణమైంది. గతంలో నేను ప్రతీ చిన్న విషయానికి కొప్పడేవాడిని. తీవ్ర అసహనానికి గురయ్యేవాడిని. ఇప్పుడు ఆ ధోరణి మారింది. అనుష్క నాలో శాంతన్ని నింపిందనుకుంటా. అనుష్క వ్యక్తిత్వం, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఆమె ప్రశాంతంగా ఉండడం నిజంగా నన్ను ప్రేరేపించింది' అని కోహ్లీ తెలిపాడు.
2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.