గడ్డు కాలంలో ఆ ఇద్దరే నన్ను కాపాడారు: విరాట్ కోహ్లీ
టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ జాతీయ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం వల్ల తనపై పడిన మానసిక, శారీరక ఒత్తిడి గురించి సంచలన విషయాలను పంచుకున్నాడు. 2021-2022 మధ్యకాలంలో తాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకునే సమయానికి పూర్తిగా అలసిపోయానని.. తనలో శక్తంతా హరించుకుపోయిందని విరాట్ కోహ్లీ తెలిపాడు. 68 టెస్టుల్లో 40 విజయాలతో టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ కెప్టెన్గా నిలిచిన విరాట్ కోహ్లీ.. తన కెప్టెన్సీలో జట్టుకు అనేక విదేశీ టెస్ట్ విజయాలను అందించాడు. అలాగే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్ వంటి ఐసీసీ వైట్-బాల్ టోర్నమెంట్లలో జట్టును నాకౌట్ దశలకు చేర్చాడు.
అయితే జట్టులో ప్రధాన బ్యాటర్గా ఉంటూనే మరోవైపు కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహించడం తనను తీవ్రంగా అలసటకు గురిచేసిందని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. కోహ్లీ మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే నేను ఒకానొక దశలో మా బ్యాటింగ్ యూనిట్కు కీ పాయింట్గా మారాను, అదే సమయంలో జట్టు నాయకత్వానికి కూడా కేంద్రబిందువు అయ్యాను. ఈ రెండు బాధ్యతలు నా దైనందిన జీవితంలో ఎంతటి భారాన్ని పెంచుతాయో నేను మొదట గ్రహించలేదు. కానీ భారత క్రికెట్ను అగ్రస్థానంలో ఉంచాలనే బలమైన కోరిక, ప్రేరణ నాలో ఉండటం వల్ల నేను ఆ ఒత్తిడిని పెద్దగా పట్టించుకోలేదు. సరిగ్గా అదే కారణం వల్ల నేను కెప్టెన్సీని వదిలేసే సమయానికి పూర్తిగా అలసిపోయాను. నాలో మరింతగా ఇవ్వడానికి ఏమీ మిగలలేదు. ఆ బాధ్యతలు నన్ను పూర్తిగా ఆవహించాయి. అవును అది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి" అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.

మంగళవారం జరిగినఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్ మూడో ఎడిషన్లో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. కెప్టెన్సీ కాలంలో వ్యక్తిగత ఫామ్ను, జట్టు ఫలితాలను సమన్వయం చేసుకోవడంలో ఎదుర్కొన్న ఒత్తిడిని విరాట్ కోహ్లీ వివరించాడు. అంచనాలను అందుకోవడం చాలా కష్టంగా ఉండేదని.. ఒకవేళ జట్టు గెలిచి పరుగులు చేయకపోతే వ్యక్తిగత ప్రదర్శన గురించి ప్రశ్నిస్తారని కోహ్లీ పేర్కొన్నాడు. ఒకవేళ పరుగులు చేసినా జట్టు గెలవకపోతే ఫలితాల గురించి నిలదీస్తారని వివరించాడు. కాబట్టి నేను ఎప్పుడూ ఈ రెండింటి మధ్య నలిగిపోతూ, నా శాయశక్తులా వాటిని మేనేజ్ చేయడానికి ప్రయత్నించేవాడినని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
టెస్ట్ క్రికెట్లో తను ఎదుర్కొన్నగడ్డుకాలంలో తనకు అండగా నిలిచిన మాజీ భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్లను విరాట్ కోహ్లీ ఈ సందర్బంగా అభినందించాడు. 2016-2019 మధ్య టెస్ట్ క్రికెట్ను శాసించిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత 2021, 2022లలో వరుసగా 28.21, 26.5 సగటుతో పేలవమైన ఫామ్ను ఎదుర్కొన్నాడు. అయితే 2023లో 8 టెస్టుల్లో 55.91 సగటుతో 671 పరుగులు చేసి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. "రాహుల్ భాయ్, విక్రమ్ రాథోడ్.. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. 2023లో నా టెస్ట్ క్రికెట్ ప్రయాణం అద్భుతంగా సాగింది. నేను వారిని ఎప్పుడు చూసినా, కలిసినా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతాను. ఎందుకంటే వారు నన్ను అంతగా చూసుకున్నారు. 'నేను వారి కోసం ఆడాలి, రాణించాలి, మైదానంలోకి వెళ్లి కష్టపడాలి' అనే భావన నాలో కలిగించారు. వారు అంతలా ఆదరించారు, ప్రోత్సహించారు" అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.
అంతేకాకుండా ఉన్నత స్థాయి క్రికెట్లోని మానసిక స్థితిని ద్రవిడ్, విక్రమ్ రాథోడ్ ఇద్దరూ బాగా అర్థం చేసుకున్నారని కోహ్లీ తెలిపాడు. "నేను ఈ రోజు నెట్స్కు వెళ్లినా.. నన్ను చూస్తున్న యువ ఆటగాళ్లు, నేను గనక తర్వాతి సెషన్లో సరిగ్గా ఆడకపోతే 'ఈయనేనా 20 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నది' అనుకుంటారేమో అనే ఆలోచన మనసులో ఎప్పుడూ ఉంటుంది. అంటే మన సొంత ప్రమాణాలను మనమే నిలబెట్టుకోవాలి. రాహుల్ భాయ్ అత్యున్నత స్థాయిలో నాకంటే చాలా మెరుగ్గా టెస్ట్ క్రికెట్ ఆడాడు కాబట్టి ఆయనకు ఇవన్నీ తెలుసు. విక్రమ్ రాథోడ్ కూడా చాలా ఏళ్లుగా క్రికెట్ వాతావరణంలో ఉన్నాడు. అందుకే నేను ఎలాంటి మానసిక స్థితిని అనుభవిస్తున్నానో వారు అర్థం చేసుకోగలిగారు, నన్ను మానసికంగా చాలా బాగా చూసుకున్నారు" అని విరాట్ కోహ్లీ వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications