ధోని రిటైర్మెంట్ ట్వీట్పై వివరణ ఇచ్చుకున్న విరాట్ కోహ్లీ (వీడియో)

హైదరాబాద్: గురువారం తన ట్విట్టర్లో ధోని గురించి పోస్టు చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. "ఆ మ్యాచ్ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మనిషి ఫిట్నెస్ టెస్ట్లో పరిగెత్తించినట్టు నన్ను పరిగెత్తించాడు" అంటూ ధోనీని ట్యాగ్ చేస్తూ విరాట్ కోహ్లీ కామెంట్ పెట్టాడు.
2016 వరల్డ్ టీ20లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్కి మొహలీ ఆతిథ్యమిచ్చింది. ఈ మ్యాచ్ గురించి కోహ్లీ ట్వీట్ చేశాడు. కోహ్లీ చేసిన ఈ ట్వీట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు తావిచ్చింది. దీంతో ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమోనని అభిమానులు ఆందోళన చెందారు.
చివరకు ధోని రిటైర్మెంట్ వార్తలపై అతడి భార్య సాక్షితో పాటు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ఖండించాడు. ధోని భార్య సాక్షి తన ట్విట్టర్లో ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని కొట్టిపారేశారు. అయితే, శనివారం అసలు ఆ ట్వీట్ను ఏ ఉద్దేశంతో పోస్ట్ చేశాననే విషయాన్ని తొలి టీ20 మ్యాచ్లో భాగంగా ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరైన కోహ్లీ వివరించాడు.
ఇంట్లో కూర్చొని సాధారణంగా ఓ ఫొటోను పోస్టు చేశా
"ఇంట్లో కూర్చొని సాధారణంగా ఓ ఫొటోను పోస్ట్ చేశాను. నా మదిలో ఏమీ లేదు. కేవలం నేను ఆనాటి జ్ఞాపకాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నానంతే. అయితే, అది ఒక పెద్ద వార్తగా మారుతుందని అనుకోలేదు. ఇది నాకో పాఠాన్ని నేర్పింది. మనం ఆలోచించే విధంగా ప్రపంచం ఆలోచించదని తెలిసింది" అని కోహ్లీ తెలిపాడు.
ఆ మ్యాచ్ ఇప్పటికీ గుర్తుంది
"నాకు ఆ మ్యాచ్ ఇప్పటికీ గుర్తుంది. ఆ మ్యాచ్పై ఇప్పటి వరకూ నేనేమీ మాట్లాడలేదు. అందుకే పోస్ట్ చేయాలని భావించి చేశాను. నేను చేసిన ట్వీట్.. ధోనికి రిటైర్మెంట్కు సంబంధించినదే అని వార్త రావడం బాధాకరం. ధోని రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదు" అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.
161 పరుగుల విజయ లక్ష్యంతో
అనంతరం 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే తడబడింది. దీంతో టీమిండియా విజయానికి ఆఖరి 6 ఓవర్లలో 67 పరుగులు అవసరమయ్యాయి. ఓపెనర్లు శిఖర్ ధావన్(13), రోహిత్ శర్మ(12) తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరగా... సురేశ్ రైనా(10) సైతం నిరాశపరిచాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు.
వికెట్ బౌలింగ్కు సహకరిస్తుండడంతో
యువరాజ్ సింగ్ (21) పరుగుల వద్ద ఔట్ కావడంతో క్రీజులోకి ధోని వచ్చాడు. దీంతో వికెట్ బౌలింగ్కు సహకరిస్తుండడంతో ధోనీ, కోహ్లీ సింగిల్స్, డబుల్స్పైనే దృష్టి పెట్టారు. తమ రన్నింగ్తో ఆసీస్ ఫీల్డర్లను తికమక పెట్టారు. ఒక ఓవర్లో ఏకంగా నాలుగు డబుల్స్ తీశారు. అలా వీరిద్దరూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ మధ్య మధ్యలో ఫోర్లు, సిక్సులు బాదడంతో టీమిండియా 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
51 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్గా
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 51 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు ధోని(18 నాటౌట్) అతడికి మద్ధతివ్వడంతో టీమిండియా అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్ ధోనీ, కోహ్లీ ఫిట్నెస్కు పరీక్ష పెట్టింది. తాజాగా ఆ మ్యాచ్ని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications