సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టు పని పట్టేందుకు ఇదే మంచి సమయమని విరాట్ కోహ్లీ మంగళవారం అన్నాడు. ప్రపంచ కప్లో భారత జట్టు దశ తిరగడంలో బౌలర్లదే కీలకపాత్ర అని కొనియాడారు. బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పాడు. గురువారం జరిగే సెమీస్లో ఆస్ట్రేలియాను ఓడించి వారి కష్టానికి తగిన న్యాయం చేసేందుకు ఇదే మంచి సమయమన్నాడు.
ఇక టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత ప్రపంచ కప్ సన్నాహకానికి దొరికిన తక్కువ సమయంలోనే లోపాలను సరిదిద్దుకున్నామన్నాడు. పరిస్థితులను సద్వినియోగం చేసుకొని సమష్టిగా రాణించారన్నాడు. కఠిన ప్రత్యర్థులతో పోరులో వారు రెట్టించిన ఉత్సాహంలో బరిలోకి దిగాల్సి ఉంటుందన్నాడు.

టోర్నీలో తాము అసలైన క్రికెట్ ఆడామని, అయితే ఏడు మ్యాచ్ల్లోనూ ప్రత్యర్థులను మన బౌలర్లు ఆలౌట్ చేయడమే జట్టులో అసలైన మార్పు అన్నాడు. ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం మైదానంలో తమకు మరిన్ని అవకాశాలు అందివస్తాయన్నాడు.
ఆస్ట్రేలియాను ఓడించేందుకు ఇది సరైన సమయమన్నాడు. ఇంతకన్నా మంచి సమయం ఉండదన్నాడు. బౌలర్లు సంయమనం, ఆత్మవిశ్వాసం, దూకుడును మేళవించి బౌలింగ్ చేస్తున్నారన్నాడు. బౌలర్లు ఏడు మ్యాచుల్లో డెబ్బై వికెట్లు పడగొట్టడాన్ని ఆయన ప్రస్తావించారు.