Virat Kohli: భారత టెస్ట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని రోజుల క్రితం రిటైర్మెంట్ ప్రకటించాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లలో విఫలమైన తర్వాత రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి చర్చలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. విరాట్ టెస్టుల నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నాడు. కానీ ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని బీసీసీఐ విరాట్ కోహ్లీని కోరింది. విరాట్, రోహిత్ ఇద్దరు ఆటగాళ్లు కలిసి టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే.
వచ్చే నెలలో ఇంగ్లాండ్లో జరిగే ఐదు టెస్టుల సిరీస్కు జట్టును ఎంపిక చేయడానికి సెలెక్టర్లు త్వరలో సమావేశం కానున్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో తన భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఆ సిరీస్లో తొలి టెస్టులో సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ ప్రదర్శన అంతగా ఏమీ లేదు. విరాట్ కోహ్లీ తన మనస్సు మార్చుకోకపోతే ఇంగ్లాండ్ పర్యటనలో భారత బ్యాటింగ్ ఆర్డర్ చాలా అనుభవం లేనిదిగాఉంటుంది.

2014 చివరలో విరాట్ కోహ్లీ భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లీ భారత కెప్టెన్గా నియమితుడయ్యాడు. 2022 ప్రారంభంలో విరాట్ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత బీసీసీఐ ఆ బాధ్యతను రోహిత్ శర్మకు అప్పగించింది. విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయితే టీమిండియాకు ఇంగ్లాండ్లో ఉన్నఇద్దరు అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్ల గైడెన్స్ లభించదు.
విరాట్ ఇంకా సమాధానం ఇవ్వలేదు..
విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని బీసీసీఐ కోరుతున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐ అభ్యర్థనకు కోహ్లీ ఇంకా స్పందించలేదు. 'కోహ్లీ తన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు బోర్డుకు తెలియజేశాడు.'అని క్రీడా వర్గాలు తెలిపాయి. కీలకమైన ఇంగ్లాండ్ పర్యటన త్వరలో ప్రారంభం కానున్నందున మరోసారి ఆలోచించాలని బీసీసీఐ విరాట్ కోహ్లీని కోరింది. ఆయన ఇంకా ఆ అభ్యర్థనకు స్పందించలేదు.
36 ఏళ్ల విరాట్ కోహ్లీ భారత్ తరఫున 123 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. విరాట్ కోహ్లీ 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. గత ఐదేళ్లలో విరాట్ కోహ్లీ సగటు పడిపోయింది. ఈ కాలంలో విరాట్ కోహ్లీ 37 మ్యాచ్ల్లో 1990 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. 2019 చివరి నాటికి విరాట్ టెస్ట్ సగటు దాదాపు 55గా ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ 5 టెస్ట్ మ్యాచ్ల్లో 23.75 సగటుతో పరుగులుతో చేశాడు. ఆ పర్యటనలో విరాట్ కోహ్లీ 8 సార్లు ఔట్ అయ్యాడు. వాటిలో 7 సార్లు ఆఫ్ స్టంప్ వెలుపలే ఔట్ అయ్యాడు.