Virat Kohli: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గత నెలలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు కోహ్లీ భారత్ తరఫున వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ 2025లో ఫైనల్కు చేరుకుంది. ఈ సారి విరాట్ కోహ్లీ తన తొలి ఐపీఎల్ ట్రోఫీని కూడా గెలుచుకోవచ్చు. ఇప్పుడు ఐపీఎల్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్ కావచ్చనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కింగ్ కోహ్లీ గురించి కీలక ప్రకటన చేశాడు.
విరాట్ కోహ్లీ గురించి అరుణ్ ధుమాల్ ఏమన్నాడంటే?
ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విరాట్ కోహ్లీని కోరారు. గతంలో బీసీసీఐ కోశాధికారిగా ఉన్న అరుణ్ ధుమాల్ ఇకపై అధికారికంగా ఆ సంస్థతో సంబంధం కలిగి లేరు. కానీ ఐపీఎల్ను బీసీసీఐ నిర్వహిస్తుంది కాబట్టి అతను ఇప్పటికీ బోర్డు అధికారిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీ టైటిల్ గెలిస్తే ఐపీఎల్ నుంచి కూడా తన రిటైర్మెంట్ ప్రకటించవచ్చనే ప్రశ్నకు సమాధానంగా అరుణ్ ధుమాల్ కీలక విషయాలను చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ టీ20లు, టెస్టుల నుంచి రిటైర్ కావడంతో విరాట్ కోహ్లీ ప్రదర్శనను చూసేందుకు ప్రపంచానికి వన్డేలు, ఐపీఎల్ మాత్రమే మిగిలి ఉన్నాయని అరుణ్ ధుమాల్ అన్నారు. కానీ కొంతమంది అభిమానులు విరాట్ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తారని భయపడుతున్నట్లు పేర్కొన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి సారి ఐపీఎల్ టైటిల్ను గెలిచేందుకు కేవలం ఒక అడుగు దూరంలో ఉందని చెప్పుకొచ్చారు. విరాట్ కోహ్లీ ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతాడని తాను అనుకోవడం లేదన్నారు. తాను దానిని ఆశించనన్నారు.
మంగళవారం ఆర్సీబీ ఐపీఎల్ గెలిస్తే విరాట్ కోహ్లీ తన టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అరుణ్ ధుమాల్ కోరారు. విరాట్ క్రికెట్ కు గొప్ప రాయబారి అని కొనియాడారు. టెన్నిస్కు జకోవిచ్ లేదా రోజర్ ఫెదరర్ ఉన్నట్లే క్రికెట్కు విరాట్ కోహ్లీ అని తాను చెబుతానన్నారు. కాబట్టి విరాట్ ఐపీఎల్ ఆడటం కొనసాగించాలని తాను కోరుకుంటున్నానన్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలనే తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తాను విరాట్ కోహ్లీని కోరుతున్నానన్నారు.