హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో ఐసీసీ ఓ డీమెరిట్ పాయింట్ను జత చేర్చింది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో సఫారీ బౌలర్ బ్యూరాన్ హెండ్రిక్స్ను కోహ్లీ కావాలనే తన భుజంతో ఢీకొట్టాడు.
ఐసీసీ ప్రవర్తనా నియమావళిని లెవల్ 1 ఉల్లంఘించినందుకు విరాట్ కోహ్లీని ఐసీసీ దోషిగా తేల్చింది. కోహ్లీ సైతం తన నేరాన్ని అంగీకరించడంతో అతడి ఖాతాలో ఐసీసీ డీమెరిట్ పాయింట్ జత చేర్చింది. 2016లో ఐసీసీ డీమెరిట్ పాయింట్ సిస్టమ్ను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత కోహ్లీకి డీమెరిట్ పాయింట్ రావడం ఇది మూడోసారి.
Bangladesh vs Afghanistan: ముక్కోణపు టీ20 సిరిస్ ఫైనల్, అందరి కళ్లు రషీద్పైనే!
జనవరి 15, 2018లో దక్షిణాఫ్రికాతో ప్రిటోరియా వేదికగా జరిగిన టెస్టులో విరాట్ కోహ్లీ ఖాతాలో తొలిసారి డీ మెరిట్ పాయింట్ చేరింది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్కప్లో ఆప్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో రెండోసారి కోహ్లీ ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ని ఐసీసీ జత చేర్చింది.
ఇదిలా ఉంటే, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడో టీ-20లో దక్షిణాఫ్రికా 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 135 పరుగుల విజయ లక్ష్యంను దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో ఛేదించి విజయాన్ని అందుకుంది.
ఈ విజయంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్ టీమిండియా, మూడో మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలిచాయి. టీ20 సిరిస్ అనంతరం అక్టోబర్ 2 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ ప్రారంభం కానుంది.