న్యూఢిల్లీ: భారత్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లి ఆటతీరు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ను తలపిస్తోందని టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఫార్మాట్లతో సంబంధం లేకుండా అసాధారణ హిట్టింగ్తో చెలరేగి రికార్డులు సృష్టించిన రిచర్డ్స్ బ్యాటింగ్ శైలికి కోహ్లి ఏమాత్రం తీసిపోడన్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో రెండు శతకాలు, ఐదు అర్ధ శతకాలతో విజృంభించిన విరాట్ కోహ్లి ఆటతీరు ప్రశంసనీయమన్నాడు. అతనితో పాటు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు కూడా ఫాంలోకి రావడంతో అత్యుత్తమ టాప్-3 బ్యాట్స్మెన్లున్న జట్టుగా భారత్ నిలిచిందన్నారు.
ధావన్ తొలి ఓవర్ నుంచే పేసర్లపై చెలరేగిపోతే.. రోహిత్ శర్మ జట్టు అవసరాలను తగినట్లు బ్యాట్ ఝుళిపిస్తున్నాడని తెలిపాడు. ఈ ముగ్గురి వల్లే ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేయగలిగామని చెప్పాడు.

2014 ఇంగ్లాండ్ పర్యటనలో వైఫల్యాల అనంతరం కోహ్లి ఆటతీరు మెరుగుపర్చుకున్నాడని, బ్యాటింగ్లో బలహీనతలను అధిగమించాడని రవిశాస్త్రి వివరించారు. ఎంఎస్ ధోనీ కెప్టెన్, బ్యాట్స్మెన్గా రాణిస్తున్నాడుని చెప్పాడు. యువ క్రికెటర్ల ప్రతిభ కారణంగా టీమిండియా 1-2 స్థానాల్లోనే ఉంటోందని తెలిపాడు.
ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో మనీష్ పాండే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. సీనియర్ ఆటగాళ్లు సురేష్ రైనా, యువరాజ్ సింగ్, తాజాగా టీమిండియాలో చోటు దక్కించుకున్న హార్దిక్ పాండ్య కూడా బాగా రాణిస్తున్నారని అన్నాడు. రైనా, యువరాజ్లు మ్యాచ్ను తమ వైపునకు తిప్పుకునే సత్తావున్న ఆటగాళ్లని ప్రశంసించాడు.