

బెంగళూరు: టీమిండియా మాజీ కేప్టెన్ విరాట్ కోహ్లీ.. కొంతకాలంగా కేరీర్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటోన్నాడు. తన కేప్టెన్సీని వదులుకున్నాడు. తన స్థానాన్ని రోహిత్ శర్మకు ధారదాత్తం చేశాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్తో మనస్పర్థలు ఏర్పడ్డాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారధ్య బాధ్యతల నుంచీ తప్పుకొన్నాడు. ఇదివరకట్లా బ్యాటింగ్లో మెరుపులు మెరిపించట్లేదు. అతని బ్యాట్ నుంచి భారీ స్కోర్ జాలువారి చాలారోజులే అయింది.
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ అతని సెలెబ్రిటీ హోదా మాత్రం తగ్గట్లేదు. ఈ కేటగిరీలో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2021లో మోస్ట్ వాల్యుబుల్ సెలెబ్రిటీగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అత్యంత విలువైన ఆటగాడిగా మరోసారి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2021లో కింగ్ కోహ్లీ బ్రాండ్ విలువ 185.7 మిలియన్ డాలర్లు. 2020తో పోల్చుకుంటే అతని బ్రాండ్ విలువ తగ్గింది. 2020లో 237.7 మిలియన్ డాలర్లుగా ఉన్న బ్రాండ్ వేల్యూ 185.7లకు తగ్గింది. అయినప్పటికీ- టాప్ మోస్ట్ సెలెబ్రిటీగా అగ్రస్థానంలో నిలిచాడు విరాట్.
టాప్ 10లో ఉన్న మోస్ట్ వాల్యుబుల్ సెలెబ్రిటీల జాబితాను డఫ్ అండ్ ఫెల్ప్స్ వెల్లడించింది. రెండో స్థానంలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నిలిచాడు. అతని బ్రాండ్ వాల్యూ 158.3 మిలియన్ డాలర్లు. 139.6 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో అక్షయ్ కుమార్ మూడో స్థానంలో ఉన్నాడు. ఆలియాభట్ బ్రాండ్ విలువ 68.1 మిలియన్ డాలర్లు. బాలీవుడ్ హీరోయిన్లల్లో టాప్ 10లో చోటు దక్కించకున్న యంగెస్ట్ సెలెబ్రిటీ ఆమె మాత్రమే. ఈ లిస్ట్లో ఆలియా భట్ది నాలుగో ప్లేస్.
టీమిండియా మాజీ కేప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బ్రాండ్ విలువ 61.2 మిలియన్ డాలర్లు. తన విలువను ధోనీ పెంచుకోగలిగాడు. 2020లో ఉన్న బ్రాండ్ విలువ 36.3 మిలియన్ డాలర్లు కాగా.. 2021లో ఈ మొత్తం 61.2 మిలియన్ డాలర్లకు పెరిగింది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తొలి 20 స్థానంలోకి తొలిసారిగా ఎంట్రీ ఇచ్చారు. ఆమె బ్రాండ్ విలువ 22 మిలియన్ డాలర్లు. 2020లో ఉన్న వాల్యూ కంటే ఆ మరుసటి సంవత్సరం ఆమె బ్రాండ్ విలువ పెరిగింది.