ఓపెనర్లు విఫలం
ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ స్వల్ప స్కోరుకే పెవిలియన్కు చేరారు. రిచర్డ్సన్ బౌలింగ్లో శిఖర్ ధావన్(1) తొలి వికెట్గా పెవిలియన్ చేరగా, ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో రోహిత్ శర్మ(14) ఎల్బీగా పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు(2)ని కమిన్స్ బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది.
నాలుగో వికెట్కు 59 పరుగులు
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్కు 59 పరుగులు జోడించిన తర్వాత ధోని(26) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత జాదవ్తో కలిసి 88 పరుగుల్ని కోహ్లీ జోడించాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 174 పరుగుల వద్ద జాదవ్ ఔట్ కాగా, విజయ్ శంకర్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ని ముందుకు నడిపించాడు.
వన్డేల్లో కోహ్లీ 41వ సెంచరీ
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సెంచరీని సాధించాడు. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడుతున్న కోహ్లీ(123) ఆడమ్ జంపా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరో మైలురాయిని సాధించాడు. వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 4000 పరుగులు సాధించిన కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్గా 4000 పరుగులు సాధించడానికి కోహ్లీకి పట్టిన ఇన్నింగ్స్ 63.
డివిలియర్స్ రికార్డు బద్దలు
దీంతో ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. కెప్టెన్గా ఏబీ డివిలియర్స్కు నాలుగువేల పరుగులు సాధించడానికి 77 ఇన్నింగ్స్లు పట్టాయి. 100 ఇన్నింగ్స్ల్లో నాలుగువేల పరుగులు చేసిన ధోని ఈ జాబితాలోమూడో స్థానంలో ఉన్నాడు. అయితే వన్డేల్లో కెప్టెన్గా నాలుగువేల పరుగులు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
|
4 వేల పరుగులు సాధించిన 12వ కెప్టెన్గా కోహ్లీ
రాంచీ వన్డేలో 27 పరుగులు చేయగానే కోహ్లీ నాలుగువేల పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో భారత్ తరుపున ధోనీ (6641), మహ్మద్ అజారుద్దీన్ (5239), సౌరభ్ గంగూలీ (5104) కెప్టెన్గా నాలుగువేలకు పైగా పరుగులు సాధించారు. ఓవరాల్గా వన్డేల్లో 4 వేల పరుగులు సాధించిన 12వ కెప్టెన్ కోహ్లీ. విరాట్ కోహ్లీ 2019లో ఇప్పటికే 500 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది విరాట్ 60 శాతానికిపైగా సగటుతో పరుగులు రాబట్టాడు.