
ముంబై: విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. రన్నింగ్ మిషన్గా అతన్ని పిలుచుకుంటారు అభిమానులు. వేల కొద్దీ పరుగులు సాధించాడు. పదుల సంఖ్యలో సెంచరీలు బాది అవతల పడేశాడు. అర్థసెంచరీలకు లెక్కే లేదు. టెస్ట్ మ్యాచ్లల్లో ఏడుసార్లు డబుల్ సెంచరీని అందుకున్న ఘనత అతని ఖాతాలో ఉంది. వన్డే ఇంటర్నేషనల్స్లో 12 వేలు, టెస్టుల్లో ఎనిమిది వేలకు పైగా పరుగులు చేశాడు. ఇంకా తన క్రికెట్ ప్రయాణాన్ని సాగిస్తోన్నాడు. ఇంకా సుదీర్ఘమైన క్రికెట్ను ఆడనున్నాడు.
ఇన్ని వేల పరుగులు, సెంచరీలు, అర్ధసెంచరీలు చేసినప్పటికీ- విరాట్ కోహ్లీకి అవేవీ పెద్దగా సంతృప్తిని ఇచ్చినట్లు కనిపించట్లేదు. తన కేరీర్ మొత్తానికీ 35 పరుగులు స్కోర్ మాత్రమే అత్యుత్తమమైనవిగా అతను తేల్చి చెప్పాడు. ఆ కాసిన్ని పరుగులకు అతను ఇంతగా ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం లేకపోలేదు. అదేమిటనేది విరాట్ కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. తన క్రికెటింగ్ కేరీర్లో ఆ 35 పరుగులు తనకు సంతృప్తినిచ్చాయని పేర్కొన్నాడు.
2011లో ఐసీసీ నిర్వహించిన ప్రపంచ కప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ వ్యక్తిగత స్కోర్ అది. శ్రీలంకపై జరిగిన ఫైనల్లో ఈ స్కోర్ చేశాడు. 49 బంతుల్లో నాలుగు ఫోర్లతో 35 పరుగులు చేశాడు. దిల్షాన్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చెప్పుకోవడానికి ఇది పెద్ద స్కోరేమీ కాదు గానీ.. దేశానికి ప్రపంచ కప్ను అందించే విషయంలో అది దోహద పడిందనడంలో సందేహాలు అక్కర్లేదు.
అదే విషయాన్ని కోహ్లీ వివరించాడు. వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్, సచిన్ టెండుల్కర్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ సమయంలో క్రీజ్లోకి వచ్చిన కోహ్లీ వెంటనే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో చెలరేగి ఆడుతున్నగౌతమ్ గంభీర్కు అండగా నిలిచాడు. స్ట్రైక్ను రొటేట్ చేశాడు. 31 పరుగుల వద్ద రెండు వికెట్లను టీమిండియా కోల్పోయిన దశలో క్రీజ్లోకి వచ్చిన కోహ్లీ.. జట్టు స్కోరు 114 పరుగుల వద్ద ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు. విలువైన భాగస్వామ్యాన్ని జోడించాడు.
ఈ 35 పరుగుల స్కోర్ను తాను ఎప్పటికీ మరిచిపోలేనని, తన కేరీర్లో అత్యంత విలువైనవిగా అభివర్ణించాడు. 2011లో సరిగ్గా ఇదే రోజున భారత క్రికెట్ జట్టు.. ప్రపంచ కప్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని- తన అభిప్రాయాలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారిక వెబ్సైట్పై పంచుకున్నాడు.