
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో సిరాజ్ వికెట్ తీసినప్పుడు విరాట్ కోహ్లీ రియాక్షన్ వైరల్ అవుతోంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం పడే అవకాశం ఉందని, అలాగే మొదట బ్యాటింగ్ చేసినప్పుడు భారత జట్టు బాగా రాణించిందని, ఇప్పుడు ఛేజ్ చేసే సవాల్ స్వీకరిస్తుందని పాండ్యా చెప్పాడు. ఈ క్రమంలో బౌలింగ్ మొదలు పెట్టిన భారత్కు సిరాజ్ మంచి ఓపెనింగ్ ఇచ్చాడు.
రెండో ఓవర్లో బంతి అందుకున్న అతను.. ఆ ఓవర్ చివరి బంతికి ట్రావిస్ హెడ్ (5)ను అవుట్ చేశాడు. సిరాజ్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడేందుకు హెడ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వెళ్లి లెగ్ స్టంప్ను కూల్చింది. దీంతో సంతోషంతో గెంతులేసిన సిరాజ్.. తన ఫాలో ఆన్లో పెద్దగా అరుస్తూ కోహ్లీ (Virat Kohli) వైపు వేలు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. కోహ్లీ కూడా అతని వైపు వేలు చూపిస్తూ ఈ వికెట్ను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది చూసిన అభిమానులందరూ ఈ వికెట్ వెనుక కోహ్లీ హస్తం ఏమైనా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.
ఇలా త్వరగా వికెట్ కోల్పోయినా కూడా ఆ తర్వాత ఆసీస్ బ్యాటర్లు కోలుకున్నారు. మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ (Hardik Pandya) బౌలింగ్లో స్మిత్ కూడా అవుటయ్యాడు. పాండ్యా వేసిన బంతిని కట్ చేసేందుకు స్మిత్ ప్రయత్నించాడు. కానీ బంతి అతను ఊహించినంత ఎత్తుగా బంతి రాకపోవడంతో షాట్ సరిగా పడలేదు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లో ఉండగానే అద్భుతంగా డైవ్ చేసిన కేఎల్ రాహుల్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఆసీస్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది.