హైదరాబాద్: 2017 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 100 మంది జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రియో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుతో పాటు మొత్తం 21 మంది క్రీడాకారులు చోటు దక్కించుకున్నారు. క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, గోల్ఫ్, ఫుట్బాల్ విభాగాలకు చెందిన ఆటగాళ్లు ఫోర్బ్స్లో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అగ్రస్ధానంలో నిలిచాడు.
ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్ధానంలో నిలివడం వరుసగా ఇది రెండోసారి. బాలీవుడ్ 'బాద్షా' షారుక్ ఖాన్ రెండో స్ధానంలో నిలవగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్ధానం దక్కించుకున్నాడు. టాప్-10లో మహిళల నుంచి ఒక్క ప్రియాంక చోప్రా మాత్రమే చోటు దక్కించుకుంది.
2017 సంవత్సరంలో సెలబ్రిటీల సంపాదన ఆధారంగా ఫోర్బ్స్ ఇండియా శుక్రవారం టాప్-100 జాబితాను ప్రకటించింది. అక్టోబర్ 1, 2016 నుంచి సెప్టెంబర్ 30, 2017 వరకు సెలబ్రిటీల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంది. అయితే ఈ ఏడాది 'ఫేమ్'ను తీసేసి, కేవలం ఆదాయం పరంగానే ర్యాంకులను ప్రకటించడం విశేషం.
అయినప్పటికీ గతేడాది ఎవరైతే టాప్-3లో నిలిచారో వారే మళ్లీ ఈ ఏడాది కూడా టాప్-3లో నిలవడం విశేషం. 51 ఏళ్ల సల్మాన్ ఖాన్ వరుసగా రెండో ఏడాది ఫోర్బ్స్ ఇండియా జాబితాలో నెంబర్ వన్ స్ధానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ రూ. 232.83 కోట్ల ఆదాయాన్ని గడించాడు.
ఫోర్బ్స్ జాబితాలో టాప్-100లో నిలిచిన అందరి ఆదాయం రూ. 2,683తో పోలిస్తే సల్మాన్ ఖాన్ ఆదాయం 8.67 శాతంగా ఉంది. ఇక, రెండో స్ధానంలో నిలిచిన షారుక్ ఖాన్ రూ. 17.5 కోట్లను ఆర్జించగా... మూడో స్ధానంలో నిలిచిన విరాట్ కోహ్లీ రూ. 100.72 కోట్లను ఆర్జించాడు.
గత ఏడాది అతని ఆదాయం రూ.134.44 కోట్లు కాగా ఈ ఏడాది అది రూ.100.72 కోట్లకు పడిపోయింది. క్రీడాకారుల జాబితాను మాత్రమే పరిశీలిస్తే కోహ్లీ అందరికంటే ముందున్నాడు. ఆ తర్వాత సచిన్, ధోనీ నిలవగా ఒలింపిక్స్లో పతకం గెలిచిన తెలుగు తేజం పీవీ సింధు మొత్తంగా 13వ స్థానంలో క్రీడాకారుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.
ఇక, షట్లర్ పీవీ సింధు విషయానికి వస్తే ఈ ఏడాది రూ. 57.25 కోట్లను ఆర్జించింది. గతేడాతి రియోలో ఒలింపిక్ పతకం సాధించిన తర్వాత పీవీ సింధు ఆదాయంలో ఒక్కసారిగా భారీ తేడా కనిపించింది. పెద్ద మొత్తంలో వాణిజ్య ప్రకటలను సొంతం చేసుకుంది. గతేడాదితో పోలిస్తే ఆమె సంపాదన 17రెట్లకు పెరిగింది.
టాప్-10లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క మహిళ ప్రియాంక చోప్రా. రూ. 68 కోట్ల సంపాదనంలో ప్రియాంక చోప్రా 7వ స్ధానంలో నిలిచింది. ఇక, దక్షిణాది నుంచి ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగింది. గతేడాది 11 మంది టాప్-100లో చోటు దక్కించుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్య 13కు పెరిగింది.
మొత్తంగా చూస్తే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది టాప్-100లో చోటు దక్కించుకున్న సెలబ్రిటీల ఆదాయం తగ్గింది. గతేడాది టాప్-100 సెలబ్రిటీల ఆదాయం రూ. 2,745 కాగా, ఈ ఏడాది రూ. 2,683గా ఉంది.
ఫోర్బ్స్లో చోటు దక్కించుకున్న క్రీడాకారుల జాబితా, వారి ఆదాయం(రూ.కోట్లల్లో):
1. కోహ్లీ- 100.72
2. సచిన్ - 82.5
3. మహేంద్ర సింగ్ ధోనీ- 63.77
4. పీవీ సింధు- 57.25
5. రవిచంద్రన్ అశ్విన్- 34.67
6. రవీంద్ర జడేజా- 34.58
7. సైనా నెహ్వాల్- 31
8. రోహిత్ శర్మ- 30.82
9. శిఖర్ ధావన్- 15.94
10. అనిర్బన్ లాహిరి- 12.44
11. యువరాజ్ సింగ్- 11.60
12. కిదాంబి శ్రీకాంత్- 6.13
13. రహానె- 5.56
14. పుజారా- 5.48
15. మురళీ విజయ్- 4.20
16. కేఎల్ రాహుల్- 4.04
17. ఉమేశ్ యాదవ్- 3.94
18. హార్దిక్ పాండ్యా- 3.04
19. సానియా మీర్జా- 2.80
20. భువనేశ్వర్ కుమార్- 2.53
21. సునీల్ ఛెత్రి- 2.92
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.