లంక పర్యటనలో కుల్దీప్ అద్భుత బౌలింగ్
అటు టెస్టు సిరీస్ నుంచి మొదలుకొని, చివరి ట్వంటీ 20 మ్యాచ్ వరకు బాధ్యతాయుతంగా కుల్దీప్ బౌలింగ్ చేశాడంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ తనకు ఎంతో స్వేచ్ఛనిచ్చాడని కుల్దీప్ తెలిపాడు. ‘విరాట్ కోహ్లి స్ఫూర్తివంతమైన నాయకుడు. జట్టుని అతను ముందుండి నడిపిస్తాడు. మైదానంలో అందరికీ మద్దతుగా నిలుస్తాడు' అని అన్నాడు.
నీకు ఎలాంటి ఫీల్డింగ్ కావాలి కుల్దీప్?
'మనం ఫీల్డ్ లో ఏమి చేయాలని అనుకుంటున్నామో అదే చేయమనే స్వేచ్ఛనిస్తాడు. మ్యాచ్లో బౌలింగ్ కోసం నా చేతికి బంతినిచ్చి నీకు ఎలాంటి ఫీల్డింగ్ కావాలి కుల్దీప్? అని అడిగాడు. ప్రతి బౌలర్ కెప్టెన్ నుంచి కోరుకునేది ఇలాంటి స్వేచ్ఛే. ఈ టీ20నే కాదు.. టెస్టులు, వన్డేల్లేనూ ఇదే తరహా మద్దతు నాకు ఇచ్చాడు' అని కుల్దీప్ చెప్పాడు.
స్వేచ్ఛ నివ్వడంతో మాపై ఒత్తిడి ఉండదు
'ఇలా బౌలర్లకు స్వేచ్ఛ నివ్వడంతో మాపై ఒత్తిడి ఉండదు. మమ్ముల్ని ముందుండి కోహ్లీ నడిపించే తీరు నిజంగా అమోఘం. అటు బ్యాట్తోనూ, ఇటు ఫీల్డింగ్లోనూ కోహ్లీ ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు. కోహ్లీతో పాటు జట్టు సమష్టి కృషి కూడా బాగుంది. ఇలాంటి జట్టు, కెప్టెన్తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది' అని కుల్దీప్ పేర్కొన్నాడు.
లంక పర్యటన ఓ కొత్త అనుభూతినిచ్చింది
మొత్తంగా శ్రీలంకతో ముగిసిన ద్వైపాక్షిక సిరీస్లో తన ప్రదర్శన ఒక కొత్త అనుభూతిని తీసుకొచ్చిందని కుల్దీప్ వెల్లడించాడు. ఈ పర్యటనలో కోహ్లీసేన పలు ప్రపంచ రికార్డులను నెలకొల్పిన సంగతి తెలిసిందే. కోహ్లీసేన శ్రీలంక పర్యటనలో ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లోనూ నెగ్గింది. ఇలా ఓ జట్టు మూడు ఫార్మాట్లలో కలిపి 9-0తో ప్రత్యర్థిని ఓడించడం ప్రపంచ క్రికెట్లో ఒక్కసారే జరిగింది.
చరిత్ర సృష్టించిన కోహ్లీసేన
ఇంతకు ముందు ఇలాంటి ఘనత ఆస్ట్రేలియా మాత్రమే సాధించింది. 2009-10లో పాక్ను 3-0తో టెస్టుల్లో, 5-0తో వన్డేల్లో, 1-0తో టీ20లో ఓడించింది. ఇప్పుడు శ్రీలంకపై కోహ్లీసేన సరిగ్గా అలానే విజయం సాధించింది. దీంతో టీమిండియా చరిత్రలోనే ఇది ఓ మైలురాయిగా నిలిచింది.