టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ యువ ఆటగాళ్లకు ఎంతో అండగా ఉంటాడు. కుర్రాళ్లతో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసే కోహ్లీకి అందరూ దగ్గరే. వాళ్లు ఏం సాధించినా కూడా కోహ్లీ మెచ్చుకుంటాడు. తాజాగా కివీస్తో మూడో టీ20లో సెంచరీ సాధించిన గిల్ను కూడా కోహ్లీ అలాగే కొనియాడాడు. అతనే భారత క్రికెట్ ఫ్యూచర్ అంటూ మెచ్చుకున్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
కొన్ని రోజుల క్రితం వరకు టీ20 ఫార్మాట్కు గిల్ పనికిరాడని చాలా మంది అన్నారు. అతని ఆటతీరు వన్డే, టెస్టులకే అని, పొట్టి ఫార్మాట్లో అతని ఆట అంత బాగోదని విశ్లేషించారు. అయితే టీం అండంతో తన ఆటతీరును మెరుగుపరుచుకున్న గిల్.. తన ఆరో ఇన్నింగ్స్లోనే సెంచరీతో చెలరేగాడు. కివీస్తో జరిగిన టీ20 మ్యాచ్లో 126 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఈ క్రమంలో టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. ఈ రికార్డు ఇంతకుముందు కోహ్లీ పేరిట ఉంది. అతను ఆసియా కప్లో ఆఫ్ఘనిస్తాన్పై 122 పరుగులతో నాటౌట్గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే గిల్ను మెచ్చుకున్న కోహ్లీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. గిల్ తనతో కలిసి ఆడుతూ సెంచరీ చేసిన ఫొటోను కోహ్లీ షేర్ చేశాడు. 'సితార.. భవిష్యత్తు ఇదే' అని ఆ ఫొటోకు క్యాప్షన్ జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు తెగ సంతోషిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నిపుణులు కూడా భారత క్రికెట్ భవిష్యత్తు ఇదేనని కొనియాడుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టులో శ్రేయాస్ అయ్యర్ స్థానంలో గిల్ను మిడిలార్డర్లో దింపాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే టెస్టు సిరీస్లో కూడా గిల్ చాలా కీలకం కానున్నాడు.