|
అనతికాలంలోనే ఆ లక్ష్యాన్ని చేరుకున్న కోహ్లీ
క్రికెట్లో తనదైన ముద్ర వేయాలంటే పూర్తిగా మారాల్సిందేనన్న దృఢ నిశ్చయానికి వచ్చిన కోహ్లీ అనతికాలంలోనే ఆ లక్ష్యాన్ని చేరుకొన్నాడు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు.. అన్న నానుడిని నిజం చేశాడు. నాటి, నేటి తన ఫొటోను కోహ్లీ ట్విట్టర్లో అభిమానులతో పంచుకొన్నాడు.
శాకాహారిగా మారిన కోహ్లీ
శారీరక సామర్థ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపే కోహ్లీ శాకాహారిగా మారిన సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచీ ఏది పడితే అది లాగించేసే అలవాటున్న కోహ్లీ... క్రికెట్లో అడుగుపెట్టిన తర్వాత కాస్త నోరు కట్టేసుకున్నాడు. నాలుగు నెలల క్రితమే మాంసాహారాన్ని వదిలేశాడు. మాంసం ద్వారా లభించే ప్రొటీన్ జోలికే వెళ్లడం లేదు. కేవలం ఆరోగ్యవంతమైన డైట్నే ఫాలో అవుతున్నాడు.
శాకాహారిగా మారిన తర్వాత మరింత ఉత్సాహంగా
అందులో ప్రొటీన్ షేక్స్, కూరగాయలు, సోయా ఎక్కువగా తీసుకుంటున్నాడు. శాకాహారిగా మారిన తర్వాత తాను మరింత ఉత్సాహంగా ఉంటున్నట్లు కోహ్లీ చెప్పాడు. ఇది కోహ్లీ ఆటకు ఎంతగానో ఉపయోగపడుతోంది. డైట్ మార్చుకోవడం అతనిలో స్పష్టమైన మార్పును తీసుకొచ్చింది. ఫీల్డ్లో బ్యాట్స్మన్గానూ, కెప్టెన్గానూ ఆ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోహ్లీని చూసి అతడి భార్య అనుష్క కూడా అతడితోపాటే శాకాహారిగా మారింది.
హైదరాబాద్ టెస్టులో కోహ్లీ ఖాతాలో అరుదైన మైలురాయి
ఇటీవలే హైదరాబాద్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన మైలురాయి వచ్చి చేరింది. ఈ మ్యాచ్లో 78 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ జట్టు స్కోరు 162 వద్ద విండిస్ బౌలర్ హోల్డర్కు వికెట్ల ముందు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో కెప్టెన్గా అత్యధిక పరుగులు చేసిన ఆసియా క్రికెటర్గా కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
పాక్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ను అధిగమించిన కోహ్లీ
65.96 యావరేజ్తో 4222 పరుగులు చేసిన కోహ్లీ, పాక్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ను అధిగమించాడు. అంతకముందు ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ పేరిట ఉంది. పాక్ తరుపున కెప్టెన్గా మిస్బావుల్ హక్ 56 టెస్టుల్లో 51.39 యావరేజితో 4214 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు ఉన్నాయి. అయితే, కోహ్లీ మాత్రం ఈ రికార్డుని 42 మ్యాచ్లకే అందుకోవడం విశేషం.
మిస్బావుల్ యావరేజితో పోలిస్తే కోహ్లీ యావరేజ్ ఎక్కువ
కెప్టెన్ కోహ్లీ 42 మ్యాచ్ల్లో 4233 పరుగులు చేశాడు. అంతేకాదు పాక్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ యావరేజితో పోలిస్తే కోహ్లీ యావరేజ్ ఎక్కువగా ఉండటం విశేషం. కోహ్లీ ఈ పరుగులను 65.12 యావరేజితో నమోదు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్యాట్స్మన్తో పోల్చినా కోహ్లీదే ఎక్కువగా ఉండటం విశేషం. ఇక, కెప్టెన్గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 8659 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.