
హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనకు ముందే, అక్కడి పరిస్థితులపై అవగాహన తెచ్చుకునేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు కోహ్లీ బీసీసీఐ అనుమతి కూడా పొందాడు. కౌంటీల్లో కోహ్లీ సుర్రే జట్టు తరుపున ఆడనున్నాడు.
అయితే, విరాట్ కోహ్లీకి కౌంటీల్లో ఆడే అవకాశం కల్పించడాన్ని ఇంగ్లండ్ మాజీ బౌలర్ బాబ్ విల్లీస్ తప్పుబట్టాడు. కోహ్లీ కౌంటీలు ఆడటమేంటి 'నాన్సెన్స్' అంటూ మండిపడ్డాడు. విదేశీ ఆటగాళ్లు కౌంటీలు ఆడితే స్థానిక ఆటగాళ్లు నష్టపోతారని ఇది ఇంగ్లాండ్ క్రికెట్కు మంచిది కాదని బాబ్ విల్లీస్ అభిప్రాయపడ్డాడు.
'విదేశీ ఆటగాళ్లు ఇంగ్లాండ్లో కౌంటీలు ఆడటాన్ని నేను సమర్థించను. అలా అనుమతిస్తే స్థానిక యువ క్రికెటర్ల అవకాశాలు దెబ్బతింటాయి. ఇంగ్లాండ్ గడ్డపై గతంలో విఫలమైన కోహ్లీ ఈ ఏడాది సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకే.. టెస్టు సిరీస్కి ముందు కౌంటీలు ఆడాలనుకోవడం అర్థంలేదు. సొంతగడ్డపై టెస్టు సిరీస్ని ఇంగ్లాండ్ చేజార్చుకోదు' అని విల్లీస్ ధీమా వ్యక్తం చేశాడు.
విదేశీ ఆటగాళ్లపై ఆధిపత్యం చెలాయించడమెలాగో మా జట్టుకి బాగా తెలుసని తెలిపాడు. కౌంటీల్లో ఆడి అనుభవం పొందిన కోహ్లిని ఇంగ్లండ్తో జరిగే టెస్ట్ సిరీస్లో ఆపటం ఇంగ్లీష్ బౌలర్లుకు కష్టతరం అవుతుందని అన్నాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్తుత్తమ బ్యాట్స్మెన్గా గుర్తింపు పొందిన కోహ్లీ త్వరలో జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్లో రాణిస్తే జోరూట్, స్టీవ్ స్మిత్, కేన్స్ విలియమ్సన్లను మించిపోతాడని వ్యాఖ్యానించాడు.
కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై జులై 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు చివర్లో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన గత ఐదు టెస్టుల్లో కోహ్లీ కేవలం 134 పరుగులు చేసి పేలవమైన ఆట తీరుతో అభిమానులను నిరుత్సాహపరిచిన విషయం తెలిసిందే.
దీంతో ఈ ఏడాది పర్యటనలో సత్తాచాటాలని కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు. ఇందులో భాగంగా సిరీస్ ఆరంభానికి ముందే అక్కడికి వెళ్లి కౌంటీలు ఆడాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. ఇదిలా ఉంటే భారత టెస్టు బ్యాట్స్మన్ పుజారా, బౌలర్లు ఇషాంత్ శర్మ, వరున్ ఆరోణ్లకు కౌంటీలు ఆడేందుకు బీసీసీఐ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.