అగ్రస్థానంలో ధోని
అత్యధిక టీ20లకు కెప్టెన్గా వ్యవహారించిన భారత ఆటగాళ్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోని(244 మ్యాచ్లు)తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో గౌతమ్ గంభీర్(170 మ్యాచ్లు)తో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత విరాట్ కోహ్లీ మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు.
8వ స్థానంలో కోహ్లీ
ఇక, అంతర్జాతీయ జాబితాలో కోహ్లీ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 234 టీ20లు ఆడాడు. ఇందులో 57 మ్యాచ్లు భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. బెంగళూరు నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి చేధించింది.
రాయుడు ఔటైన తర్వాత కూడా ధోని దూకుడు
చెన్నై ఆటగాళ్లలో కెప్టెన్ ధోని (70 నాటౌట్; 34 బంతుల్లో ఒక ఫోర్, 7సిక్సులు) బాదగా, తెలుగు కుర్రాడు అంబటి రాయుడు (82; 53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు)తో చెలరేగాడు. 55 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నైని వీరిద్దరూ ఆదుకున్నారు. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాయడు ఇచ్చిన సునాయస క్యాచ్ను ఉమేశ్ యాదవ్ జారవిడిచాడు.
చివరి 5 ఓవర్లలో మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన ధోని
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మ్యాచ్ 15 ఓవర్ల వరకు బెంగళూరు వైపే ఉన్నప్పటికీ, చివరి 5 ఓవర్లలో బెంగళూరు బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. 18 ఓవర్లో రాయుడు 82(53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు)ను ఉమేశ్ యాదవే రనౌట్ చేశాడు.
తదుపరి మ్యాచ్ కోల్కతా నైట్రైడర్స్తో
రాయుడు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చి బ్రేవో (14) సాయంతో ధోని (70) గెలుపుని సిక్సుతో లాంఛనంగా పూర్తి చేశాడు. బెంగళూరు బౌలర్లలో యజువేంద్ర చాహల్ రెండు, ఉమేశ్ యాదవ్, పవన్ నేగి తలో వికెట్ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. టోర్నీలో భాగంగా బెంగళూరు తన తదుపరి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది.