ఆ రోజే నాకెంతో ప్రత్యేకం:
'తొలిసారి టీమిండియాకుఎంపికైన రోజే నాకెంతో ప్రత్యేకం. ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు అమ్మతో కలిసి వార్తలు చూస్తున్నా. జట్టు యాజమాన్యం నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదు. ఒక్కసారిగా టీవీలో నా పేరు ప్రత్యక్షం కావడంతో ఏం చేయాలో తోచలేదు. నన్ను నేను నియంత్రించుకోలేకపోయా. కూర్చోవాలో, నిలబడలో, పరుగెత్తాలో, ఎగిరి దూకాలో అర్ధం కాలేదు. ఆ ఒక్క సందర్భాన్ని నేను రోజుకు ఎనిమిది సార్లు గుర్తు తెచ్చుకుంటాను' అని కోహ్లీ తెలిపాడు.
కెరీర్ ఆరంభమే నన్ను నిలబెట్టింది:
'జాతీయ జట్టు తరఫున టోర్నీలు ఆడినప్పుడు గుర్తింపు లభిస్తుంది. గుర్తింపు నుంచి ఘనతలు వస్తాయి. కానీ.. ఎనిమిదేళ్ల కుర్రాడు క్రికెట్ ఆడటం మొదలు పెట్టి దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ఎంతో కష్టపడక తప్పదు. ఆ అనుభూతిని ఎప్పటికీ పునఃసృష్టి చేయలేం. చాలా కష్టపడ్డాను. అమ్మ అన్నివిధాలుగా అండదండలు అందించంచింది. కెరీర్ ఆరంభమే నన్ను నిలబెట్టింది. అది స్పష్టత, దార్శనికత, ప్రేరణనిచ్చింది. నేనెక్కడి నుంచి వచ్చానో గుర్తుచేస్తూ నన్ను నేలపైనే ఉంచుతోంది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
బద్దలు కొట్టని రికార్డుల్లేవు:
2009 అండర్-19 ప్రపంచకప్ జట్టుకు విరాట్ కోహ్లీ సారథ్యం వహించాడు. అద్భుతమైన బ్యాటింగ్, నాయకత్వంతో జట్టును విజేతగా నిలిపాడు. కోహ్లీలోని ప్రతిభను గమనించిన బీసీసీఐ సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో జట్టులోకి వచ్చాడు. సచిన్,సెహ్వాగ్, గంభీర్, జహీర్, నెహ్రా, హర్భజన్, యువరాజ్ లాంటి సీనియర్లతో కలిసి ఆడాడు. ధోనీ నుంచి సారథ్య బాధ్యతలు అందుకుని తిరుగులేని కెప్టెన్గా ఎదిగాడు. కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్లో బద్దలు చేయని రికార్డుల్లేవు. సృష్టించని ఘనతల్లేవు.
కోహ్లీ ఒక్కడే:
ఐసీసీ అవార్డుల్లో టీమిండియా వన్డే కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. 2019కి గాను ఐసీసీ బుధవారం పురస్కారాలను ప్రకటించింది. కోహ్లీకి 'స్పిరిట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. అలాగే టెస్టు, వన్డే జట్టుకు కెప్టెన్గా కోహ్లీ ఎంపికయ్యాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు, వన్డే రెండు ఫార్మాట్లలోనూ స్థానం సంపాదించిన భారత ఆటగాళ్లలో కోహ్లీ ఒక్కడే ఉన్నాడు.