రాజ్కోట్: టీమిండియా టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై జట్టు ఆటగాడు, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ వ్యూహాలు , ఆలోచనల్లో ఎంతో వైవిధ్యం ఉంటుందని అజింక్య రహానె కొనియాడాడు. అతడి నాయకత్వంలో ఆడడాన్ని తాను అమితంగా ఆనందిస్తానని తెలిపాడు. బుధవారం నుంచి ఇంగ్లాండ్తో తొలి టెస్టు మొదలవుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రహానె మీడియాతో మాట్లాడాడు. ఎంఎస్ ధోని కన్నా కోహ్లి మరింత దూకుడుగా ఉంటాడని, ఒత్తిడిలో పూర్తిగా ప్రశాంతంగా కనిపిస్తాడని తెలిపాడు. అయితే ధోనీ నుంచి కోహ్లీ ఎంతో నేర్చుకున్నాడని, వాటిని అమలు చేస్తున్నాడని తెలిపాడు.

విరాట్ కెప్టెన్సీలో ఆడటం చాలా బాగుంటుందని, అతడు పూర్తిగా జట్టు మనిషని పేర్కొన్నాడు. జట్టు సమావేశాల్లో కోహ్లీ మాటలు, అనుసరించే వ్యూహాలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయని ప్రశంసించాడు. తనను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం పట్ల రహానె సంతోషం వ్యక్తం చేశాడు.
ఈ బాధ్యత తనలో అప్రమత్తత పెంచుతుందన్నాడు. అంతే గాకుండా తనలో అత్యుత్తమ ఆటతీరును వెలికి తీస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. తనను వైస్ కెప్టెన్ ఎంపిక చేసిన బీసీసీఐకి, సెలక్టర్లకు ఈ సందర్భంగా రహానే కృతజ్ఞతలు తెలియజేశాడు. డీఆర్ఎస్(డిసిషెన్ రివ్యూ సిస్టమ్)పై జట్టుకు కొన్ని ప్రణాళికలున్నాయని తెలిపాడు. దీనిపై మరింత చర్చ అవసరమని అభిప్రాయపడ్డాడు.
ఇంగ్లాండ్ జట్టు సాధారణ జట్టేమీ కాదని, విజయం కోసం ఇరు జట్లు గట్టి పోరాటమే చేయాల్సి ఉంటుందని తెలిపాడు. సమష్టి కృష్టి సిరీస్ సాధించేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.