
ఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు అమరవీరులకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నివాళులర్పించాడు. అత్యంత సంక్లిష్ట సమయంలో పనిచేస్తూ.. ప్రాణత్యాగం చేసిన వీరులను జాతి మరవదని పేర్కొన్నాడు. జమ్మూ కశ్మీర్లో ఆదివారం 16 గంటల పాటు భీకర ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.
'క్లిష్ట పరిస్థితుల్లోనూ విధులను మర్చిపోని వారే నిజమైన హీరోలు. వారి త్యాగం మర్చిపోవద్దు. హంద్వారాలో అమరులైన సైనికులు, పోలీసులకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. జైహింద్' అంటూ విరాట్ కోహ్లీ ఆ ఐదుగురు అమర జవాన్ల ఫొటోలతో ఓ ట్వీట్ చేశాడు.
జమ్మూకాశ్మీర్లోని హంద్వారాలో తీవ్రవాదులు కాల్పులతో రెచ్చిపోయారు. అయితే 16 గంటల పాటు సాగిన భీకర ఎన్కౌంటర్లో భద్రతా దళాలకు తీవ్ర ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఎదురుకాల్పుల్లో సైన్యానికి చెందిన ఒక కర్నల్, ఒక మేజర్, ఇద్దరు సైనికులు, జమ్మూ-కశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన ఒక ఎస్సై మరణించారు. ఘటనాస్థలిలో చిక్కుకుపోయిన పౌరులను రక్షించే క్రమంలో వీరు వీరమరణం పొందారు. ఇద్దరు ఉగ్రవాదులను సైనిక కమాండోలు మట్టుబెట్టారు. శనివారం సాయంత్రం 3 గంటలకు ఈ ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
కరోనా వైరస్పై యుద్ధం చేసేందుకు, లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసేందుకు నిర్వహిస్తున్న ఆన్లైన్ సంగీత విభావరిలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భాగస్వాములు కానున్నారు. 'ఐ ఫర్ ఇండియా' చేపడుతున్న ఈ కార్యక్రమంలో నటులు, సంగీత దర్శకులు, గాయకులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు పాల్గొని.. తమ ఇంటి దగ్గరి నుంచే ప్రజలను ఎంటర్టైన్ చేయనున్నారు. దీని ద్వారా నిధులను సమీకరించనున్నారు.
కరోనాపై పోరు కోసం పీఎం-కేర్స్ ఫండ్, మహారాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధి కోసం విరుష్క జోడి నిధులు అందించనున్నట్లు గతంలోనే ప్రకటించైనా విషయం తెలిసిందే. అయితే తాము ఎంత మొత్తం విరాళంగా ఇస్తున్నది మాత్రం వారిద్దరు గోప్యంగా ఉంచారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరు రూ. 3 కోట్లు విరాళం ఇచ్చారని తెలిసింది.