2023 సంవత్సరం ముగిసింది. ఈ ఏడాదిలో ప్రపంచ విజేతగా నిలిచే రెండు అవకాశాలను టీమిండియా చేజార్చుకుంది. రెండేళ్లుగా కష్టపడి వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్కు చేరి తుదిమెట్టులో బోల్తాపడింది. దాదాపు నెలన్నర పాటు సాగిన వన్డే వరల్డ్ కప్లోనూ అదేపరిస్థితి ఎదురైంది. టోర్నీ ఆద్యంతం ఎదురులేని భారత్గా వరుస విజయాలు సాధించి.. ఫైనల్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది.
అయితే తాజాగా వరల్డ్ కప్ ఫైనల్కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్గా మారింది. ఆస్ట్రేలియా విజయం సాధించిన అనంతరం కెమెరాలన్నీ దాదాపు సంబరాలపై ఎక్కువగా ఫోకస్ చేశాయి. తర్వాత టీమిండియా ఆటగాళ్ల భావోద్వేగాలపై కొంతమేర దృష్టి పెట్టాయి. అయితే ఫైనల్ ఓటమి అనంతరం కోహ్లి ఎమోషనల్ వీడియో ఒకటి తాజాగా బయటకువచ్చింది .

సిరాజ్ వేసిన 43 ఓవర్ ఆఖరి బంతికి మాక్స్వెల్ రెండు పరుగులు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా మైదానంలోకి దూసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సమయంలో కోహ్లి బాధతో విలవిలలాడిపోయాడు. బాధను దిగమింగుతూ వికెట్ల వద్దకు వచ్చి తన క్యాప్తో బెయిల్స్ను పడగొట్టి అలానే కాసేపు ఉండిపోయాడు. మరోవైపు అదే టైమ్లో రోహిత్ సహచరులతో కలిసి కన్నీటితో విరాట్ ముందుకు వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కోహ్లి, రోహిత్ను ఇలా చూస్తుంటే బాధగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రపంచకప్లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. కోహ్లి ఇన్నింగ్స్కు ఇరుసులా మారితే రోహిత్ ఆదినుంచే ప్రత్యర్థిపై దాడికి దిగుతూ పైచేయి సాధించారు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి, రోహిత్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. 11 మ్యాచ్ల్లో కోహ్లి 765 పరుగులు సాధిస్తే, రోహిత్ 597 పరుగులు చేశాడు. కాగా, విరాట్ ఒకే ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు.