ఏకైక క్రికెటర్ కోహ్లీ:
గత మార్చి నుండి క్రికెట్ మ్యాచ్లు లేక ఇంటికే పరిమితమైనప్పటికీ.. సామాజిక మాధ్యమాల అర్జనలో విరాట్ కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. లాక్డౌన్ సమయంలో ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా అత్యధికంగా సంపాదించిన టాప్-10 క్రీడాకారుల జాబితాలో విరాట్ ఆరో స్థానంలో నిలిచాడు. టాప్-10లో ఉన్న ఏకైక క్రికెటర్ కోహ్లీ మాత్రమే. మార్చి 12 నుంచి మే 14 వరకు సోషల్ మీడియా అర్జన వివరాలను 'అటైన్' అనే కన్సల్టింగ్ కంపెనీ శుక్రవారం ప్రకటించింది.
ఒక్కో పోస్టుకు రూ. 1. 20 కోట్లు:
మార్చి 12 నుంచి మే 14 వరకు విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో 3 ఫొటోలు పోస్ట్ చేసాడు. ఆ ఫొటోలకు మూడు కోట్ల 62 లక్షలు (379,294 పౌండ్లు) ఆర్జించాడు. అంటే ప్రతి పోస్టుకు రూ. 1. 20 కోట్లు (126,431 పౌండ్లు) సంపాదించాడు. ఈ జాబితాలో రూ. 17.21 కోట్లతో ఫుట్బాల్ స్టార్ క్రిస్టియనో రొనాల్డో అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఫుట్బాల్ స్టార్ ఆటగాళ్లు లియోనెల్ మెస్సి (రూ.11.45 కోట్లు), నెయ్మార్ (రూ. 10.50 కోట్లు) ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
ఫోర్బ్స్ జాబితాలో కూడా:
ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల టాప్-100 జాబితాలో భారత్ నుంచి విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు లభించింది. ఫోర్బ్స్ జాబితాలో రూ. 196 కోట్ల ఆదాయంతో భారత కెప్టెన్ 66వ స్థానంలో నిలిచాడు. గత ఏడాదితో పోలిస్తే.. విరాట్ 34 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. కోహ్లీకి ఎండార్స్మెంట్ల ద్వారా 2 కోట్ల 40 లక్షల డాలర్లు లభించగా.. 20 లక్షల డాలర్లు ప్రైజ్మనీ, వేతనం ద్వారా వచ్చాయి. టాప్-100లో నిలిచిన ఏకైక క్రికెటర్, భారత్ నుంచి ఏకైక క్రీడాకారుడు కోహ్లీనే కావడం విశేషం
2008లో అంతర్జాతీయ అరంగేట్రం:
2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.