
మరో 8 సిక్సులు:
సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా 5 టీ20 మ్యాచులు ఆడనుండటంతో.. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ రెండు రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. టీ20ల్లో మరో 8 సిక్సులు కొడితే.. 50 సిక్సులు బాదిన రెండో కెప్టెన్గా కోహ్లీ రికార్డు నెలకొల్పుతాడు. కోహ్లీ కంటే ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (62) మాత్రమే ఉన్నాడు. 5 టీ20 మ్యాచులు ఉండడంతో ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది.

80 పరుగులు చేస్తే ధోనీ రికార్డు బద్దలు:
పరుగుల విషయంలోనూ విరాట్ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పే ఆస్కారం ఉంది. టీ20ల్లో కెప్టెన్గా ఎంఎస్ ధోనీ 1,110 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 1,032 పరుగులతో ఉన్నాడు. ఇప్పటి వరకూ టీ20ల్లో 1,273 పరుగులతో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అగ్ర స్థానంలో ఉన్నాడు. కోహ్లీ మరో 80 పరుగులు చేస్తే ధోనీ రికార్డు, 241 పరుగులు చేస్తే డుప్లెసిస్ రికార్డును అధిగమిస్తాడు.

ఆక్లాండ్ చేరిన టీమిండియా:
ఈ పర్యటనలో ఫిబ్రవరి 5 నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది. ఫిబ్రవరి 5, 8, 11 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఫిబ్రవరి 21న తొలి టెస్ట్, ఫిబ్రవరి 29న రెండో టెస్ట్ ప్రారంభం కానున్నాయి. గత ఏడాది న్యూజిలాండ్లో పర్యటించిన టీమిండియా వన్డే సిరీస్ను 4-1తో గెలుచుకొని.. టీ20 సిరీస్ను 1-2తో కోల్పోయింది. మంగళవారం భారత క్రికెట్ జట్టు కివీస్ గడ్డపై అడుగుపెట్టింది. ఆక్లాండ్ చేరుకున్నామంటూ కోహ్లీ తెలిపాడు.

ప్రాక్టీస్, జిమ్ సెషన్లతో బిజీ:
మంగళవారం విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లు.. బుధవారం ప్రాక్టీస్, జిమ్ సెషన్లలో పాల్గొన్నారు. జిమ్ సెషన్లో కసరత్తులు చేసిన తర్వాత కోహ్లీ సహచర ఆటగాళ్లతో కలిసి పసందైన విందు ఆరగించాడు. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, మనీశ్ పాండేలతో లంచ్ చేస్తుండగా.. తీసిన సెల్ఫీ ఫొటోను కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు. 'టాప్ టీమ్ జిమ్ సెషన్ తర్వాత అందమైన ఆక్లాండ్లో మంచి భోజనం చేసాం' అని రాసుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
