సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్తో వాగ్వాదం పైన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ శుక్రవారం నాడు మరోసారి స్పందించాడు. ఫాల్కనర్తో తన వాగ్వాదం కేవలం సరదా కోసమేనని, తాము యుద్ధం కోసం క్రికెట్ మైదానంకు వెళ్లడం లేదని చెప్పాడు.
మూడో వన్నడే, నాలుగో వన్డేలలో విరాట్ కోహ్లీ - జేమ్స్ ఫాల్కనర్ల మధ్య స్లెడ్జింగ్ జరిగినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మూడో వన్డేలో.. కోహ్లీని ఫాల్కనర్ ఏదో అనగా... వెంటనే స్పందించిన కోహ్లీ.. నీ బౌలింగ్లో నేను చాలాసార్లు బాదాను, వెళ్లి బౌలింగ్ చెయ్ అన్నాడు.
ఆ తర్వాత నాలుగో వన్డే సందర్భంగా... ఇన్నింగ్స్ 22వ ఓవర్లో సింగిల్ కోసం ప్రయత్నించిన కోహ్లీని రనౌట్ చేసే అవకాశం వచ్చింది. మిడాన్లో ఉన్న ఫాల్కనర్ తగిన విధంగా స్పందించలేకపోయాడు. దీంతో అతడ్ని ఉద్దేశించి 'గాఢ నిద్రలో ఉన్నట్లున్నవావ్' అని కోహ్లీ నవ్వుతూ వ్యాఖ్యానించాడు.
ఈ తన వ్యాఖ్యల పైన కోహ్లీ శుక్రవారం నాడు స్పందిస్తూ.. అవి సరదాకేనని చెప్పాడు. నేను ఫీల్డుకు ప్రత్యర్థి జట్టుతో ఫైట్ కోసం వెళ్లడం లేదని, అవి కేవలం ఆనందం కోసమే అన్నాడు. అంతకుముందు కోహ్లీ ఓసారి మాట్లాడుతూ... ఎవరైనా హద్దు దాటనంత వరకు స్లెడ్జింగ్ ఉండవచ్చునని చెప్పాడు.