
పాస్ మార్కులు వస్తే చాలనుకున్నా:
శనివారం ఒక స్పోర్ట్స్ వెబ్ షోకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కోహ్లీ పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. 'చదువుకునే రోజుల్లో గణితం అంటే చాలా భయం. ఆ సమయంలో గణితంలో పడిన కష్టం క్రికెట్ ఆడేటప్పుడు ఎప్పుడూ పడలేదు. 100 మార్కులకు కేవలం 3 మార్కులే వచ్చాయంటే అర్ధం చేసుకోండి గణితం అంటే ఎంత భయమే. నా జీవితంలో ఎప్పుడు సమీకరణాలను ఉపయోగించలేదు. ఎలాగైనా పదో తరగతిలో గణితంలో పాస్ మార్కులు వస్తే చాలనుకున్నా. దానికోసం పడ్డ కష్టం అంతాఇంతా కాదు' అని కోహ్లీ తెలిపారు.

నాన్న చివరి శ్వాసను చూశా:
'2006 డిసెంబర్లో కర్ణాటకతో ఢిల్లీ తరఫున నాలుగు రోజుల మ్యాచ్ ఆడుతున్నా. మూడో రోజు మేం బ్యాటింగ్ చేయాల్సి ఉండగా.. తెల్లవారుజామున నా నాన్నకి సీరియస్గా ఉండడంతో అందరం ఆందోళన చెందాం. ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు. ఆయన చివరి శ్వాసను చూశా. నాకు ఏడుపు రాలేదు. అంతా బ్లాంక్గా అనిపించింది. కోచ్కు ఫోన్ చేసి విషయం చెప్పా. మధ్యలో వదిలేయడం సరికాదని.. మ్యాచ్ ఆడి 90 పరుగులు చేశా. తిరిగి సాయంత్రం అంత్యక్రియలకు హాజరయ్యా. ఆరోజే ఎప్పటికైనా జాతీయ జట్టు తరఫున ఆడతానని నా సోదరుడికి మాటిచ్చా' అని కోహ్లీ చెప్పారు.

భయం ప్రత్యర్థుల్లో ఉండాలనుకున్నా:
'కెరీర్ ప్రారంభంలో నన్ను చూసి ప్రత్యర్థి జట్లు భయపడ్డ, గౌరవించిన సందర్భాలు లేవు. ఎందుకంటే 2012కు ముందు నేనో సాధారణ ఆటగాడిని. ప్రత్యర్థి జట్లు అసలు నా గురించి ఆలోచించేవి కావు. ఇలా వచ్చి అలా వెళతాడనే భావనలో ఉండేవి. బౌలర్లు కూడా తేలిగ్గానే తీసుకునేవారు. కానీ నేనలా ఉండాలని కోరుకోలేదు. క్రీజులోకి వస్తుంటే ఇతన్ని త్వరగా అవుట్ చేయాలి.. లేకుంటే మ్యాచ్ ఓడిపోతామనే భయం ప్రత్యర్థుల్లో ఉండాలనుకున్నా. ఆ దిశగా ఆడే ప్రయత్నం చేశా. ముఖ్యంగా ఫిట్నెస్ నన్ను పూర్తిగా మార్చివేసింది' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












