
గతేడాది చివర్లో జరిగిన బంగ్లాదేశ్ వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్న టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ.. కొత్త ఏడాదిని కూడా ఘనంగా ప్రారంభించాడు. శ్రీలంకతో గువాహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో కూడా కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకున్న కోహ్లీ.. అద్భుతంగా ఆడాడు. అతను 118 పరుగులతో రాణించడంతో భారత జట్టు కూడా భారీ స్కోరు చేసింది. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది.
కొంతకాలం క్రితం వరకూ ఫామ్ లేక తంటాలు పడిన విరాట్ కోహ్లీ.. ఆసియా కప్ ముందు ఫామ్ అందుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇన్నిరోజులు దిగజారుతూ వచ్చిన కోహ్లీ ర్యాంకు మెరుగైంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు మెరుగయ్యాడు. కెరీర్లో అత్యుత్తమంగా టాప్ ర్యాంకులో నిలిచిన అతను.. ఫామ్ కోల్పోవడంతో 8వ ర్యాంకుకు చేరాడు. మళ్లీ ఇప్పుడు ఫామ్ అందుకోవడంతో రెండు స్థానాలు మెరుగు పరుచుకున్న కోహ్లీ.. వన్డే బ్యాటర్ల జాబితాలో ఆరో స్థానానికి చేరాడు.
కోహ్లీతోపాటు రోహిత్ శర్మ, పేసర్ మహ్మద్ సిరాజ్ ర్యాంకులు కూడా మెరుగయ్యాయి. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో దూకుడుగా ఆడి 83 పరుగులు చేసిన రోహిత్ ర్యాంకు కూడా ఒక స్థానం మెరుగైంది. అతను ప్రస్తుతం 8వ ర్యాంక్ చేరుకున్నాడు. ఇదే మ్యాచ్లో రెండు వికెట్లు తీసుకొని రాణించిన హైదరాబాద్ పేసర్ సిరాజ్.. బెస్ట్ బౌలర్ల జాబితాలో నాలుగు స్థానాలు ఎగబాకి 18వ ర్యాంక్ సాధించాడు. సిరాజ్ గతేడాది నుంచి వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో అద్భుత సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.