హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్లే గొప్ప బ్యాట్స్మెన్లు అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ అభిప్రాయప డ్డాడు. జియో సూపర్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్యూలో యూసఫ్ మాట్లాడాడు.
గతంతో పోల్చితే ప్రస్తుత క్రికెట్లో నాణ్యత కొరవడిందని యూసఫ్ చెప్పాడు. విరాట్ కోహ్లీ మంచి బ్యాట్స్మెన్ అని అతడి ఆటను చూసేందుకు ఇష్టపడతానని చెప్పాడు. కానీ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ల స్థాయి అతడిది కాదని చెప్పుకొచ్చాడు.

తాను ఆడినప్పుడు ఉన్న అద్భుతమైన బౌలర్లు ఇప్పుడు లేరని చెప్పాడు. 'ఆస్ట్రేలియాలో మెక్గ్రాత్, షేన్ వార్న్, భారత్లో అనిల్ కుంబ్లే, శ్రీనాథ్ అద్భుత బౌలర్లు' అని యూసఫ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు పిచ్లన్నీ బ్యాట్స్మెన్ ఫ్రెండ్లీగా తయారయ్యాయని చెప్పాడు.
సచిన్, ద్రవిడ్ బలమైన జట్లు, బౌలర్లను ఎదుర్కొని క్లిష్టపరిస్థితుల్లో కూడా రాణించారని యూసఫ్ అన్నాడు. 1998 నుంచి 2010 వరకు పాకిస్థాన్ తరుపున 90 టెస్టులు, 288 వన్డేలు ఆడిన యూసఫ్ 39 సెంచరీలు, 97 అర్ధ సెంచరీలు సాధించాడు.